చంద్రబాబు నాయుడు సవాల్ స్వీకరించే దమ్ముందా జగన్?

chandrababu naidu comments on jagan governmentటిడిపి అధినేత చంద్రబాబు నాయుడు గురువారం ఏలూరు జిల్లా కుక్కునూరు మండలంలోని వరద ముంపుకు గురైన ప్రాంతాలలో పర్యటించారు.

ఈ సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “ఒక నాయకుడు ప్రజలకు కష్టాలు వస్తే వెంటనే అక్కడకు వెళ్ళి వారికి ధైర్యం చెప్పి వారి సమస్యలను తీర్చాలి. ఇదివరకు హూద్ హూద్ తుఫాను విశాఖనగరంపై విరుచుకుపడినప్పుడు నేను అక్కడ పది రోజులు మకాంవేసి అన్ని సమస్యలు పరిష్కరించిన తరువాతే తిరిగి వచ్చాను.

ADVERTISEMENT

నాసిక్ నుంచి 1,500 కిమీ ప్రవహించి వచ్చే గోదావరినది ఒరవడి గురించి అధికారులు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసి నివేదికలు అందజేస్తుంటారు. గోదావరికి వరద వస్తుందని అధికారులు హెచ్చరిస్తుంటే ఈ ముఖ్యమంత్రి తాడేపల్లి ప్యాలస్‌లో పడుకొని నిద్రపోతున్నాడు. నేను ముంపు గ్రామాలలో పర్యటించి వరద బాధితులను పరామర్శించి వచ్చిన నాలుగు రోజుల తరువాత తాపీగా వెళ్ళి పరామర్శించారు.

అప్పుడూ ఏం చెప్పారు? పోలవరం ముంపు గ్రామాలకు నష్టపరిహారం ఇవ్వలేమని, దాని కోసం కేంద్రంతో యుద్ధాలు చేస్తూనే ఉన్నామని, లేఖలు వ్రాస్తూనే ఉన్నామని నంగి నంగి మాటలు చెప్పారు. ఆనాడు మీకు 23 మంది ఎంపీలను ఇస్తే కేంద్రం మెడలు వంచి నిర్వాసితులకు ప్యాకేజీ సాధిస్తామని చెప్పారు కదా?మరి ఎందుకు సాధించలేకపోయారు? ఒకవేళ ఆర్‌ అండ్ ఆర్‌ ప్యాకేజీ సాధించడం మీకు సాధ్యం కాకపోతే మీ 23 మంది ఎంపీల చేత రాజీనామా చేయించండి.. ఎలా రాదో నేనూ చూస్తాను,” అని చంద్రబాబు నాయుడు సిఎం జగన్మోహన్ రెడ్డికి సవాల్ విసిరారు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి జీవనాడిగా మారే పోలవరం ప్రాజెక్టు కోసం మీరందరూ గ్రామాలు ఖాళీ చేసి వెళ్లిపోయేందుకు సిద్దపడ్డారు. ఈ ముఖ్యమంత్రి జగన్ మీ త్యాగాలను పట్టించుకోకుండా పోలవరం డ్యామ్ ఎత్తు తగ్గిస్తామని, ప్రాజెక్టులో నీళ్ళు నింపనని కల్లబొల్లి మాటలు చెప్పాడు. అసలు పోలవరం ప్రాజెక్టు పూర్తిచేయలేనని చెపుతున్నవాడు దానిలో నీళ్ళు ఎలా నింపుతాడు?” అని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు.

టిడిపి మళ్ళీ అధికారంలోకి వస్తే పోలవరం ముంపు గ్రామలన్నిటినీ కలిపి ఓ జిల్లాగా ఏర్పాటు చేస్తానని చంద్రబాబు నాయుడు ప్రజలకు హామీ ఇచ్చారు.

ADVERTISEMENT
Latest Stories