కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజులు పూర్తి చేసుకున్న తరుణంలో ఈ నెల రోజులలో కూటమి ప్రభుత్వ పని తీరు మీద విశ్లేషణ చేస్తే ఈ సారి ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఏ రాజకీయ పార్టీకైనా అది సవాళ్లతో కూడుకున్నదే అవుతుంది.
అప్పులతో, తాకట్లతో ప్రభుత్వాన్ని నెట్టుకొచ్చిన వైసీపీ పార్టీ వ్యవస్థలను విచ్ఛిన్నం చేసి, కూల్చి వేతలను రాష్ట్రానికి పరిచయం చేసి రాష్ట్రాన్ని తిరోగమనం వైపు నెట్టింది. ఆర్థికంగా, సామాజికంగా కూలిపోయిన రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి పదం వైపు నడపడానికి తన నలభై ఏళ్ళ రాజకీయ అనుభవాన్నిపెట్టుబడిగా పెడుతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.
రాష్ట్రం ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితులలో ఒక పక్క సంక్షేమాన్ని మరో పక్క అభివృద్ధిని కలిపి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇప్పుడు బాబు చేస్తుంది అదే. తన నాలుగు దశబ్దాల అనుభవంతో రాష్ట్రాన్ని ఈ నెల రోజులలోనే పట్టాలెక్కించడంలో నూటికి నూరు శాతం విజయం సాధించారు బాబు. ముందుగా గత ఐదేళ్లుగా ఘాడ నిద్రలో ఉన్న ప్రభుత్వ వ్యవస్థలన్నిటిలో చలనం తీసుకు వచ్చారు.
ఐదేళ్లుగా విధ్వంసం మాటున మౌన రోధన అనుభవించిన రాష్ట్ర రాజధాని అమరావతికి పూర్వ వైభవం తీసుకు వస్తున్నారు. ప్రజల ఆస్తులకు రక్షణ కల్పిస్తూ ల్యాండ్ టైట్లింగ్ ఆక్ట్ ను రద్దు చేసారు.ఎన్నికల హామీలో ఇచ్చిన అదనపు పెన్షన్ ను వాలంటీర్ల సాయం లేకుండానే నెల మొదటి రోజే పంపిణి చేయగలిగారు. అధికార అహంకారానికి తావివ్వకుండా ప్రజాపాలన కొనసాగిస్తున్నారు.
హంగామా, హడావుడి లేకుండా క్లిన్ అండ్ గుడ్ గవర్నెన్స్ అందించారు. అధికారం అంటే పదవి కాదు బాధ్యత అనేది ప్రభుత్వ ఉద్యోగులకు, మంత్రులకు తెలిసి వచ్చేలా తానూ ఆచరించి చూపించారు. ప్రభుత్వం ఏర్పడిన నెల రోజులకే రాష్ట్రానికి పారిశ్రామిక వేత్తలను తీసుకురాగలిగారు. అలాగే BPCL వంటి సంస్థ రాష్ట్రంలో 60 కోట్లతో పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చేలా మెప్పించినగలిగారు.
యువతకు ఉపాధి అవకాశాలు సృష్టించడానికి ఉన్న అన్ని మార్గాలను అన్వేషిస్తున్నారు. ఉచిత ఇసుకను ఇచ్చిన హామీ ప్రకారం అమలు చేస్తున్నారు. 5 రూ.లకే పేదవాడి ఆకలి తీర్చే అన్న క్యాంటిన్లను పునరుద్ధరిస్తున్నారు. పోలవరం పై సమీక్షలకు విదేశీ బృందాలను ప్రాజెక్ట్ సందర్శనకు తీసుకువచ్చారు. గత ప్రభుత్వంలో మంత్రులంటే రబ్బర్ స్టాంపుల మాదిరే పని చేసే వారు.
కానీ కూటమి ప్రభుత్వంలో ప్రతి మంత్రికి ఆయా శాల మీద పూర్తి స్వేచ్ఛ, అధికారాలను ఇవ్వడంతో ప్రతి ఒక్కరు తమ సామర్ధ్యాన్ని నిరూపించుకోవడానికి ప్రచారాలకు దూరంగా ప్రజలకు దగ్గరగా పని చేస్తున్నారు. ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లే ముఖ్యమంత్రి ఎంత బాధ్యతగా, జవాబుదారిగా ఉంటే ఆ కింద స్థాయి వ్యవస్థలు అంత బలంగా పని చేస్తాయని బాబు, పవన్ లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నెల రోజులలోనే ప్రజలకు నిరూపించి చూపించారు.
బాబుకు సవాళ్లు కొత్తకాదు, అయినప్పటికీ తన నాలుగు దశబ్దాల రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడని విధ్వంసకర పాలన గత ఐదేళ్లలో చూశానని, అసలు వ్యవస్థలలో తల ఎక్కడో, తోకెక్కడో తెలుసుకోవడానికే నా అనుభవం సరిపోవడం లేదని, అయినా వెనకడుగు వేయకుండా పట్టుదలతో పని చేసి రాష్ట్రాన్ని మళ్ళీ గాడిన పెట్టి తీరుతా అంటున్నారు బాబు.
సినిమా పరిభాషలో చెప్పాలంటే ఈ నెల రోజుల పాలన కూటమి ప్రభుత్వానికి జస్ట్ ట్రైలర్ లాంటిదే. ట్రైలర్ లోనే వచ్చే ఐదేళ్లలో ప్రభుత్వం ఎలా పని చేసిందో చేసి చూపించారు కూటమి నేతలు.






