టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు నేడు మంగళగిరి టిడిపి కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలతో విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన జగన్ ప్రభుత్వం నిశిత విమర్శలు చేశారు. రాష్ట్రవిభజన జరిగినప్పుడు రాష్ట్రంలో సుమారు 20 మిలియన్ యూనిట్లు కొరత ఉండేది. మేము అధికారంలోకి రాగానే యుద్ధ ప్రాతిపదికన ఆ సమస్యను పరిష్కరించడమే కాకుండా మిగులు విద్యుత్ ఉత్పత్తి స్థాయికి తీసుకువెళ్ళాము.
వేసవిలో విద్యుత్ డిమాండ్ ఎక్కువగా ఉంటుంది కనుక దాని కోసం నాలుగైదు నెలల ముందు నుంచే అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకొనేవాళ్ళం. ఆ కారణంగానే మా హయాంలో ఎన్నడూ విద్యుత్ కోతలు ఉండేవి కావు. విద్యుత్ ఛార్జీలు కూడా పెంచలేదు. కానీ జగన్ పాలనలో రాష్ట్రంలో మళ్ళీ విద్యుత్ కొరత ఏర్పడటంతో ఎప్పుడు చూసినా విద్యుత్ కోతలే.
విద్యుత్ సరఫరా లేకపోతే విద్యుత్ వినియోగం ఉండదు కనుక కరెంటు బిల్లులు తక్కువ రావాలి కదా? కానీ కరెంటు ఉన్నా లేకపోయినా బారీగా బిల్లులు వస్తున్నాయి. నాలుగేళ్ళలో ఏడుసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డిదే. విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, చివరికి మీటర్ల దగ్గర కూడా కమీషన్లు మింగేస్తున్నాడు.
ఏ రాష్ట్రంలోనైనా ఆయా ప్రాంతాలలో జరిగిన అభివృద్ధి కారణంగా భూముల విలువ పెరుగుతుంటుంది. కానీ ఏపీలో అభివృద్ధి నిలిచిపోయినందున, ప్రభుత్వమే తన ఆదాయం పెంచుకోవడం కోసం భూముల విలువ పెంచవలసివస్తోంది. అయితే భూముల విలువ పెరుగకపోయినా రిజిస్ట్రేషన్ ఛార్జీలు మాత్రం ఎప్పటికప్పుడు పెంచుకుపోతోంది. ఒకప్పుడు ఏపీలో ఒక ఎకరం భూమి అమ్మితే ఆ డబ్బుతో తెలంగాణ మూడు ఎకరాలు కొనగలిగేవారు. కానీ ఇప్పుడు తెలంగాణలో ఒక్క ఎకరం డబ్బుతో ఏపీలో 50 నుంచి 100 ఎకరాలు కొనొచ్చు. ఇది ఏపీ వెనకబాటుకి పెద్ద నిదర్శనం కాదా?
ఈ జగన్మోహన్ రెడ్డికి అభివృద్ధి చేయలేరు కానీ చేయలేరని ఎవరైనా అంటే కోపం పొడుచుకొస్తుంది. ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారిపై అక్రమంగా కేసులు పెట్టించి పోలీసులతో వేధించడం, మహిళలైతే వారి క్యారక్టర్ గురించి తప్పుడు ప్రచారం చేస్తారు. వారి ఫోటోలను మార్ఫింగ్ చేసి అశ్లీల ఫోటోలను వారి బంధుమిత్రులకు పంపిస్తుంటారు. రాజకీయ ప్రత్యర్ధులను శారీరికంగా, మానసికంగా, రాజకీయంగా, ఆర్ధికంగా దెబ్బతీసి పైశాచికానందం అనుభవిస్తుంటారు.
సంపూర్ణ మధ్యపానం అమలుచేస్తామని చెప్పి, మధ్యం రెట్లు రెండు మూడు రెట్లు పెంచేయడమే కాకుండా, నాసిరకం మద్యం, నకిలీ మద్యం సరఫరా చేస్తూ ప్రజల జీవితాలను నాశనం చేసేస్తోంది ఈ జగన్ ప్రభుత్వం. సంవత్సరాల్లో రాష్ట్రంలో జరగబోయే మద్యం అమ్మకాలను చూపించి దానిపై కూడా రూ.25-30 వేల కోట్ల అప్పులు చేసెసింది ఈ జగన్ ప్రభుత్వం.
గుడివాడలో టిడ్కో ఇళ్లను నేను కట్టిస్తే వాటికి జగన్ తన పార్టీ రంగులేసుకొని తాను కట్టించానని అబద్దాలు చెప్పుకొంటున్నాడు. ఇది ఎవరికో పుట్టిన బిడ్డని నా బిడ్డ అని చెప్పుకొంటున్నట్లుంది. ఎవరి బిడ్డనో దత్తత తీసుకోవచ్చు కానీ నాకు పుట్టిన బిడ్డే అని చెప్పుకోవడం సిగ్గుచేటు.
రాష్ట్రంలో ఎక్కడ చూసిన గంజాయి బ్యాచులు, బ్లేడు బ్యాచులు, తుపాకులు పట్టుకొని తిరిగే బ్యాచులు, సెటిల్మెంట్ బ్యాచులే. విశాఖలో వైసీపీ ఎంపీ కుటుంబ సభ్యులని కిడ్నాప్ చేసింది ఈ గంజాయి బ్యాచే. ఈ వేధింపులు భరించలేక మీ ఎంపీ విశాఖ నుంచి హైదరాబాద్కు మకాం మార్చేయడం నిజమా కాదా? మీ సొంత పార్టీ ఎంపీ ఒకరు (రఘురామకృష్ణరాజు) ఢిల్లీకి, మరొకరు (ఎంవీవీ సత్యనారాయణ) హైదరాబాద్ పారిపోయి అక్కడ ఎందుకు తలదాచుకొంటున్నారు? మీ సొంత పార్టీ ఎంపీల వేధింపులు తప్పనప్పుడు ఇక ప్రతిపక్షాలను, ప్రజలను ఉపేక్షిస్తారని ఆశించడం ఆత్యాసే కదా?” అంటూ చంద్రబాబు నాయుడు సిఎం జగన్మోహన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు.
చంద్రబాబు నాయుడు చెప్పినవన్నీ నూటికి నూరుశాతం వాస్తవాలే అని రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. కనుక మార్పు కోరుకొంటే వచ్చే ఎన్నికలే అందుకు చివరి అవకాశం లేకుంటే మరెన్నటికీ సాధ్యం కాకపోవచ్చు.



