నవ్యాంధ్ర రాజధాని అమరావతి రక్షణకై రైతులు చేపట్టిన ఉద్యమానికి ఏడాది పూర్తయిన సందర్భంగా ‘జనరణభేరి’ పేరిట భారీ బహిరంగ సభను అమరావతి జేఏసీ నిర్వహించింది. దీనికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్, వామపక్ష నేతలు హాజరయ్యి రైతులకు తమ సంఘీభావం తెలిపారు. బీజేపీ, జనసేన నేతలు మాత్రం దూరంగా ఉన్నారు.
ఈ సభలో చంద్రబాబు మాట్లాడుతూ…. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మీద విరుచుకుపడ్డారు. ‘‘జగన్ ఇష్టమొచ్చినప్పుడు ముద్దులు.. ఇప్పుడు పిడిగుద్దులా. పవిత్ర పుణ్యక్షేత్రాల నుంచి నీరు, మట్టి తీసుకొచ్చాం. ప్రధాని పార్లమెంట్ నుంచి మట్టి తీసుకొచ్చారు. సాక్షాత్తు పార్లమెంట్ మీకు అండగా ఉంటుందని ప్రధాని చెప్పారు,” అన్నారు చంద్రబాబు.
“జగన్ గాలి కబుర్లు చెప్పడం ఇప్పటికైనా మానుకోవాలి. ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిదంటున్నారు.. 19 నెలల్లో ఏం పీకారు. అమరావతిలో నాకు ఇల్లు లేదంటున్నారు.. మీరు కట్టి ఏం పీకారు. ఒక కులంలో పుట్టడం నా తప్పా? అమరావతి ఉద్యమం చరిత్రలో నిలిచిపోతుంది, ఇప్పటికైనా చేసిన తప్పును ఒప్పుకుని క్షమాపణ చెప్పాలి,” అని డిమాండ్ చేశారు.
రైతులు, మహిళలను రియల్ ఎస్టేట్ వ్యాపారులని సీఎం అంటున్నారు… ప్రజల రక్తాన్ని తాగే వ్యాపారస్తుడిలా బెహేవ్ చేస్తున్నాడు. త్యాగం చేసిన రైతులపై ఇష్టానుసారం మాట్లాడుతారా? ద్రౌపది వస్త్రాపహరణం చేసినందుకు సామ్రాజ్యం కూలిపోయింది. మహిళల శాపంతో వైఎస్సార్ కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోతుంది’’ అని చంద్రబాబు హెచ్చరించారు.



