సెప్టెంబర్ 9వ తేదీన టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుని స్కిల్ డెవలప్మెంట్ కేసులో వైసీపి ప్రభుత్వం అరెస్ట్ చేసింది. సెప్టెంబర్ 10 నుంచి సుమారు రెండు నెలలు జైలులో నిర్బందించి ఉంచడంతో, ఆయన గురించి వార్తాలే తప్ప ప్రజలకు కనబడలేదు.
చంద్రబాబు నాయుడు కంటి ఆపరేషన్ కోసం అక్టోబర్ 31వ తేదీన నాలుగు వారాలకు హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో కొన్ని గంటల సేపు మాత్రమే ఆయన ప్రజలకు కనబడ్డారు. తర్వాత కంటి ఆపరేషన్ చేయించుకొన్నందున బయటకు రాలేదు.
నవంబర్ 20వ తేదీన హైకోర్టు చంద్రబాబు నాయుడుకి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. వైసీపి ప్రభుత్వం హైకోర్టు తీర్పుని సవాలు చేస్తూ సుప్రీంకోర్టుకి వెళ్లింది కానీ అక్కడా దానికి ఎదురుదెబ్బ తగిలింది. ఈ నెల 28వ తేదీ నుంచి ఆయన రాజకీయ సభలు, సమావేశాలకు హాజరయ్యేందుకు కూడా సుప్రీంకోర్టు అనుమతించడం వైసీపి ప్రభుత్వం జీర్ణించుకోవడం చాలా కష్టమే.
సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినందున చంద్రబాబు నాయుడు అతి త్వరలోనే ప్రజల మద్యకు రాబోతున్నారు. కానీ అంతకంటే ముందుగా ఈరోజు సాయంత్రం సతీసమేతంగా తిరుమల చేరుకొని రేపు ఉదయం స్వామివారిని దర్శించుకొంటారు. తర్వాత ఉదయం 11.30 గంటలకు రేణిగుంట విమానాశ్రయం నుంచి బయలుదేరి 12.40 గంటలకు గన్నవరం విమానాశ్రయం చేరుకొంటారు. ముందుగా బెజవాడ కనకదుర్గమ్మ దర్శనం చేసుకొంటారు. ఆ తర్వాత శ్రీశైలం మల్లన్న స్వామివారిని, విశాఖలోని సింహాద్రి అప్పన్నను దర్శించుకొంటారు.
చంద్రబాబు నాయుడు 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో అరెస్ట్ కావడం, సుమారు రెండు నెలలు జైల్లో ఉండటం ఓ పీడకల వంటిది. కనుక టిడిపికి పట్టిన వైసీపి చీడపీడలన్నీ వదిలిపోవాలంటే దైవానుగ్రహం కూడా అవసరం. అందుకే చంద్రబాబు నాయుడు ప్రజల మద్యకు వచ్చే ముందు దైవదర్శనం చేసుకొంటున్నారు.
మరో నాలుగైదు రోజులలో చంద్రబాబు నాయుడు ఇవన్నీ పూర్తిచేసుకొని ప్రజల మద్యకు వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత ఎన్నికల శంఖారావం పూరించి వైసీపితో యుద్ధానికి టిడిపి శ్రేణులను, ప్రజలను సిద్దం చేయనున్నారు. చంద్రబాబు నాయుడుని చూసి దాదాపు మూడు నెలలు కావస్తోంది. కనుక ప్రజలు కూడా ఆయన కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.




