ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య మరో వివాదం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై తెలంగాణలోని పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. తమ “ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్ లైన్” అప్లికేషన్ ను ఏపీ సర్కార్ కాపీ చేసిందని ఆరోపిస్తూ తెలంగాణా అధికారులు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాము తయారు చేసిన ఆన్ లైన్ అప్లికేషన్ ఫార్మాట్ ను ఏపీ ప్రభుత్వం మక్కీకి మక్కీ తస్కరించిందని ఈ ఫిర్యాదులో అధికారులు పేర్కొన్నారు. తమ అప్లికేషన్ లో తెలంగాణ అన్న పదం ఉన్న చోట్ల ఏపీ అని పెట్టుకుందని వారు ఫిర్యాదులో తెలిపారు.
అయితే ఈ ఆరోపణలపై ఏపీ సర్కార్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అసలు ఈ అంశంలో గతేడాది దేశంలోనే నెంబర్ 2 స్థానంలో ఉన్న తాము తెలంగాణ విధానాలను కాపీ కొట్టాల్సిన ఖర్మ తనకేంటని కూడా ఏపీ వాదిస్తోంది. ఈ మేరకు ఏపీ తన వాదనను అధికారికంగా వినిపించేందుకు సన్నాహాలు చేస్తోంది. తెలంగాణ ఫిర్యాదుపై సమాచారం అందుకున్న వెంటనే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి సాల్మన్ ఆరోఖ్య రాజ్ ను ఆరా తీయగా, ఇవన్నీ పూర్తిగా నిరాధారమని ఆరోఖ్యరాజ్ సీఎంకు వివరించినట్లు సమాచారం. ఇదే విషయాన్ని అధికారికంగా ప్రకటించాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.
పరిశ్రమల స్థాపనకు అనుకూల వాతావరణం నెలకొల్పి పెట్టుబడులను ఆకర్షించడంలో ఏపీ ముందంజలో ఉంది. ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’పై ప్రపంచ బ్యాంకు, కేంద్రం వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ నిర్వహించిన తొలి సర్వేలోనే రెండో స్థానంలో నిలిచాం. తెలంగాణను చూసి కాపీ కొట్టాల్సిన అవసరం లేదు. పారిశ్రామిక, వాణిజ్య పరమైన వివాదాలకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు, ఆయా వివాదాలకు సంబంధించి న్యాయస్థానం వేసిన ప్రశ్నలను యథాతథంగా వెబ్ సైట్ లో పొందుపరిచాం. ఇందులో మార్పు చేర్పులకు వీల్లేదు.
నిజానికి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు సంబంధించి ఈ ఏడాది జూన్ 30తో ముగిసిన గడువు ముగిసినా… కేంద్రంపై ఒత్తిడి చేసి గడువును ఈ నెల 7 వరకు పొడిగించేలా చేశాం. అయినప్పటికీ సంబంధిత ఆధారాలను జూన్ 30 లోపే సమర్పించాం. తెలంగాణకు ఏమైనా సందేహాలుంటే… ప్రపంచ బ్యాంకు, కేంద్రం వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖలను సంప్రదించవచ్చని ఏపీ తన వాదనను వినిపించనున్నట్లు సమాచారం.



