ఏపీలో వైసీపి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో సంక్షేమ పధకాల గోల తప్ప అభివృద్ధి అనే మాటే వినిపించడం లేదు. రాష్ట్ర రాజధాని గురించి అడిగితే వైసీపిలో ఎవరూ సూటిగా సమాధానం చెప్పలేరు కానీ సంక్షేమ పధకాల గురించి తెలిసీ తెలియకుండానే ఏదో మాట్లాడేస్తుంటారు.
అయితే వైసీపిలో చాలా మందికి తమ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పధకాలకు సంబందించి పూర్తి వివరాలు కూడా తెలియవనే చెప్పాలి. అందుకే సంక్షేమ పధకాలంటేనే అభివృద్ధి అని కొత్త నిర్వచనం చెపుతున్నారనుకోవచ్చు.
సంక్షేమ పధకాలే అభివృద్ధి అని చెప్పుకొంటున్నప్పుడు మళ్ళీ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు దేనికో వారే చెప్పాలి.
ఈ పధకాల కోసం చేస్తున్న అప్పుల వలన రాష్ట్రం దివాళా తీస్తుందని కేంద్ర ప్రభుత్వం, మేధావులు హెచ్చరిస్తూనే ఉన్నారు. రాజకీయాలకు దూరంగా ఉంటూ ఆధ్యాత్మిక ప్రపంచంలో జీవించే త్రిదండి చిన్న జీయర్ స్వామి కూడా ఏపీలో అమలవుతున్న ఈ పధకాలపై తనదైన శైలిలో స్పదించారంటే, వీటి వలన చివరికి ఏమి జరుగబోతోందో అర్దం చేసుకోవచ్చు.
ఆయన నిన్న కృష్ణాజిల్లా వీరవల్లి మండలంలో ఓ కార్యక్రమానికి వచ్చినప్పుడు మీడియాతో మాట్లాడుతూ, “ప్రభుత్వాలు సంక్షేమ పధకాల పేరుతో ప్రజలకు రాయితీలు ఇస్తున్నాయి. మనిషి పుడితే ఒకటి, కూర్చొంటే ఒకటి, నడిస్తే ఒకటి, పడుకొంటే ఒకటి, తింటే ఒకటి, తినకపోతే మరొక రాయితీలు ఇస్తున్నాయి.
ఇలా ఏదో పేరుతో రాయితీలు ఇస్తుండటం ద్వారా ప్రభుత్వాలే ప్రజలను బద్దకస్థులుగా మార్చేస్తున్నాయి. ప్రభుత్వం ఏదో పేరుతో డబ్బు ఇంటికే పంపిస్తున్నప్పుడు మళ్ళీ ఏదో పని చేసుకొని జీవించడం ఎందుకు?అప్పనంగా చేతికి వస్తున్న డబ్బుతో హాయిగా బ్రతికేద్దామనే ఆలోచన ప్రభుత్వాలే ప్రజలకు కలిగిలే చేస్తున్నాయి. ఈ విధానం, ఈ ధోరణి సమాజానికి ఎంత మాత్రం మంచిది కాదు,” అని అన్నారు.
వైసీపి ఎంతో గొప్పగా చెప్పుకొంటున్న సంక్షేమ పధకాలపై స్వామీజీ ఈవిదంగా మాట్లాడటంతో, వైసీపి నేతలు తమ అధినేతను ప్రసన్నం చేసుకోవడం కోసమైనా ఆయనపై బాణాలు సందించక తప్పదు. కానీ తమ అధినేత హిందూ ఓటు బ్యాంక్ కోసం బెజవాడ కనకదుర్గ గుడిలో తిప్పలు పడుతున్నందున, జీయర్ స్వామీజీపై తాము బాణాలు సందించవద్దో లేదో అని తాడేపల్లి నుంచి సిగ్నల్ కోసం ఎదురుచూస్తున్నట్లున్నారు. అందుకే ఇంకా మంత్రులు రోజా, అంబటి రాంబాబు తదితరులు ఇంకా కౌంటర్స్ వేయలేదేమో?




