ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా షూటింగ్ కు బ్రేక్ పడినట్లుగా ట్రేడ్ వర్గాలు ఘోషిస్తున్నాయి. సెట్స్ పైకి వెళ్ళడానికి ముందు దాదాపు ఒక సంవత్సరం పాటు ఎంతో గ్రౌండ్ వర్క్ చేసిన ఈ సినిమా షూటింగ్ ఉన్నట్లుండి ఆగిపోవడం వెనుక మెగాస్టార్ చిరంజీవి వ్యక్తపరిచిన అసంతృప్తే ప్రధాన కారణమని సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.
ఈ సినిమా తొలి షాట్ ను చిరు – అలీల మధ్య చిత్రీకరించిన విషయం తెలిసిందే. అయితే అలీతో తీసిన కామెడీ సన్నివేశాలు ఆశించినంత రీతిలో పండడం లేదని, అందుకే సదరు సన్నివేశాలను మళ్ళీ రీ షూట్ చేయాలని మెగాస్టార్ కోరిన మీద మళ్ళీ స్క్రిప్ట్ పేపర్లు పట్టుకోవడం పరుచూరి బ్రదర్స్ వంతయ్యిందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఇదిలా ఉంటే అలీ స్థానంలో మరో కమెడియన్ ను ఎంపిక చేసారన్న టాక్ కూడా ఇటీవల హల్చల్ చేసిన సంగతి తెలిసిందే.
ఏది ఏమైనా, స్క్రిప్ట్ లో మళ్ళీ భారీ మార్పులు జరగబోతున్నాయని, దర్శకుడు వివి వినాయక్ తో పాటు స్క్రీన్ ప్లే అందిస్తున్న సాయి బుర్రా మాధవ్ కూడా ఇందులో పాలు పంచుకుంటున్నారని… ఫైనల్ గా మళ్ళీ ‘మెగా’ మూవీ స్క్రిప్ట్ తుది మెరుగులు దిద్దుకుంటోందని లేటెస్ట్ సమాచారం. కారణాలు ఏమైనా మెగా మూవీ షూటింగ్ కు బ్రేక్ పడడం అభిమానులకు నిరాశజనకమైన విషయమే కదా! ఇలా బ్రేక్ లు పడుతూ సాగితే ఆశించిన విడుదల తేదీ 2017 సంక్రాంతికి మెగాస్టార్ హంగామా ఉండకపోవచ్చనేది అభిమానులకు నిట్టూర్పు కలిగించే విషయం.



