వైస్ జగన్ అనే నేను..,అంటూ మొదలుపెట్టిన వైసీపీ ఐదేళ్ల పాలన చివరికి ఆ జగన్ తోనే ముగిపోయింది. ప్రజలిచ్చిన అధికారాన్ని రాష్ట్రం కోసం కాకుండా వ్యక్తిగత స్వార్దానికి వినియోగించుకుంటే ఆ పార్టీ భవిష్యత్తు ఎలా ఉంటుంది అనే దానికి సజీవ సాక్షిగా నిలిచింది వైసీపీ.
2024 ఏపీలో జరిగిన ఎన్నికలలో వైసీపీ పతనం పాతాళానికి పడిందంటే దానికి ప్రతిపక్షాల పోరాటాలు ఒక అస్త్రంగా నిలిస్తే జగన్ చేసుకున్న స్వీయ తప్పిదాలు మరో అస్త్రంగా మారాయని చెప్పాలి. ఒక అహంకారికి అధికారం చేతిలో పెడితే ఎం జరుగుతుందో గడిచిన ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం చవి చూసారు. ఇందులో సామాన్యుడు నుంచి రాజకీయాలతో సంబంధం లేని సెలబ్రెటీల వరకు అందరు జగన్ బాధితులే కావడం ఇక్కడ కొస మెరుపు.
పద్మ అవార్డుల గ్రహీతలు సైతం వైసీపీ నేతల అవమానాలను, చీత్కారాలను ఎదుర్కోక తప్పలేదు. ఇందులో సూపర్ స్టార్ రజనీకాంత్ నుంచి మెగా స్టార్ చిరంజీవి వరకు వైసీపీ మాట దాడిలో గాయపడినవారే. జగన్ అధికారంలోకి వచ్చాక సినీ ఇండస్ట్రీని దెబ్బకొట్టేలా సినిమా టికెట్ల రేట్లను తగ్గిస్తూ జీవో జారీ చేసారు. దీనితో సమస్య పరిష్కారానికి ఇండస్ట్రీ పెద్దలంతా తాడేపల్లి ప్యాలస్ గేట్ కొట్టారు.
చిరంజీవి, రాజమౌళి, మహేష్ బాబు, ప్రభాస్ వంటి సినీ దిగ్గజాలు మొత్తం తమ ఇండస్ట్రీ బాగు కోసం జగన్ ముందు చేతులు చాచాల్సిన దుస్థితి తీసుకువచ్చారు జగన్. పవన్ మీద ఉన్న ఆక్రోశం, కోపం, ద్వేషం మొత్తం చిరుని అవమానించడంతో చల్లార్చుకోవాలి భావించిన జగన్ అందుకు తగ్గట్టే చిరు దండం పెట్టి జగన్ ను వేడుకుంటున్న వీడియో ఒకటి బయటకు వదిలారు.
దీనితో అటు మెగా అభిమానులు, జనసైనికులతో పాటుగా యావత్ తెలుగు రాష్ట్రాల ప్రజలు తాడేపల్లి ప్యాలస్ లో చిరుకు జరిగిన అవమానం మీద రగిలిపోయారు. ఇందులో మరి ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన అన్న పట్ల జగన్ వ్యవహరించిన తీరుని తూర్పారబట్టారు. పద్మ అవార్డు దక్కించుకున్న చిరంజీవి గారు 30 అవినీతి కేసులలో జైలుకెళ్లోచ్చిన వ్యక్తి దగ్గర చేతులు చాచడంతో జగన్ పతనానికి అక్కడే తొలి మెట్టు కట్టారు పవన్.
ఆనాడు జగన్ కు చిరు పెట్టిన దండమే జగన్ పార్టీకి పిండంగా మారింది. అధికారం ఉంది అనే అహంతో ఎంతటి వారినైనా కించపరుస్తా, ఎవరినైనా జైలుకు పంపిస్తా, దేనినైనా కూల్చేస్తా, అసెంబ్లీ ని ఒక పశువుల సంతలా మార్చేస్తా అంటూ మొండి వైఖరితో ముందుకెళ్తున్న జగన్ కు, వైసీపీ పార్టీకి ‘ప్రభుత్వ వ్యతిరేక ఓటును చిలనివ్వను’ అంటూ ప్రకటించి బ్రేకులు వేశారు పవన్. ఇక బాబు అరెస్టుతో టీడీపీ తో పొత్తుకు శ్రీకారం చుట్టి వైసీపీ పార్టీని ఏపీలో సమాధి చేస్తానంటూ శపధం చేసారు.
ఇప్పుడు ఆ శపధాన్నే నిజం చేస్తూ వైసీపీ ని 11 సీట్లతో అధః పాతాళానికి తొక్కి కూటమిలో తన వంతు బాధ్యతను నెరవేర్చారు పవన్. దీనితో కూటమి విజయంలో మాన్ ఆఫ్ ది మ్యాచ్ పవన్ కళ్యాణ్ కే సొంతం అంటూ అటు సోషల్ మీడియాతో పాటు గా ఇటు మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానెల్స్ కూడా మోతమోగిస్తున్నాయి. ఈ సందర్భంగా పవన్ ను జగన్ ను ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో “అన్న దండం పెడితే తమ్ముడు పిండం” పెట్టాడు అంటూ మీమ్స్ సందడి చేస్తున్నాయి.






