సీజేపీ ఉద్యమం: ప్రభుత్వాలకు హెచ్చరిక – విపక్షాలకు ఆశాకిరణం.?

CJP NEET protest gains nationwide support

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో దేశవ్యాప్తంగా సంచనలనం సృష్టించిన సీజేపీ నీట్ ఉద్యమం ప్రభుత్వాలకు ఒక హెచ్చరికగా విపక్షాలకు ఒక ఆశాకిరణంలా కనిపిస్తుంది.

ప్రజల భావోద్వేగాలతో ముడిపడే అంశాలతో ఉద్యమాలు చేపడితే అవి ఎంతటివారినైనా సరే చరిత్ర సృష్టికర్తలుగా మార్చగలవు అని నిరూపించింది కాక్రోచ్ జనతా పార్టీ.

ADVERTISEMENT

నిన్నమొన్నటి వరకు దేశంలో సగం మందికి కూడా తెలియని కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పుడు మోడీ సర్కార్ పై పోరాటంతో ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. పన్నెండేళ్ల మోడీ సర్కార్ మెడలు వంచిన పార్టీగా చరిత్ర సృష్టించింది.

దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న కాంగ్రెస్ పార్టీకి చేతకానిది సోషల్ మీడియాలో పుట్టుకొచ్చిన పార్టీకి ఎలా సాధ్యమయ్యింది.? అనే ప్రశ్న ఇప్పుడు కీలకంగా మారింది.

అయితే కాక్రోచ్ జనతా పార్టీ ఎత్తుకున్న నినాదం, అందుకు వారు ప్రభుత్వం ముందుంచిన డిమాండ్లు నేటి తరం విద్యార్థులకు న్యాయబద్దంగా కనిపించడం, వారి తల్లితండ్రులకు ఆమోదయోగ్యం కావడం సీజేపీ మొదటి విజయం అని చెప్పవచ్చు.

ఇక ఇన్నాళ్ళుగా బీజేపీ ప్రభుత్వం విపక్షం లేని పాలన చేయడంతో ప్రభుత్వ పెద్దలకు జవాబుదారీతనం అనేది పూర్తిగా కొరవడింది అనే అభిప్రాయం సామాన్య ప్రజానీకం మనసులో దాగి ఉంది. నీట్ పరీక్షా పాత్రల లీకేజ్ అనేది మోడీ సర్కార్ కి ఇదే తొలిసారి కాదు.

కానీ ఇప్పుడే ప్రభుత్వం ఎందుకింతలా స్పందించింది, ఎందుకు మంత్రి రాజీనామా వరకు వెళ్ళింది అంటే అది సీజేపీ ఎత్తుకున్న నినాదం, వారు పెట్టిన షరతులే కారణం. ఒక్కసారి జరిగితే అది పొరపాటు అని ప్రజలు సరిపెట్టుకుంటారు, కానీ పదేపదే అదే పొరపాటు జరుగుతుంది అంటే అది ప్రభుత్వ నిర్లక్ష్యమే అవుతుంది.

ఇప్పుడు ఆ నిర్లక్ష్యానికి బీజేపీ మూల్యం చెల్లించాల్సిందే అనే భావన సామాన్యుడి మెదడును తొలిచేసింది. ఆ సామాన్యుడి ఆలోచనే సీజేపీ డిమాండ్ల రూపంలో బయటకు రావడంతో సీజేపీ ఉద్యమానికి సామాన్యుడి నుండి సెలబ్రెటీల వరకు మద్దతు దక్కింది.

అయితే ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ప్రభుత్వం పై పోరాటం చేస్తే ప్రజాస్వామ్య దేశంలో ఎంతటి కొమ్ములు తిరిగిన పార్టీ అయినా చివరికి దిగిరావాల్సిందే అని సీజేపీ ఉద్యమం తో రుజువయ్యింది.

కాబట్టి ఇక నుంచి ప్రభుత్వాలు, ప్రభుత్వ పెద్దలు నిరంకుశత్వంగా, ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే అందుకు అడ్డుకట్ట వేయడానికి బొద్దింక మాదిరి కీటకాలు పుట్టుకొస్తాయని సీజేపీ ప్రభుత్వాలకు ఒకరకమైన హెచ్చరికను పంపుతూనే, మరోపక్క చిత్తశుద్ధి తో ప్రభుత్వాల మీద పోరాడేందుకు విపక్షాలకు ఒక ఆశాకిరణంలా కనిపిస్తుంది.

ADVERTISEMENT
Latest Stories