చంద్రబాబు బెయిలు ఎపిసోడ్ తో కాస్త చల్లబడిన వైసీపీ – టీడీపీ పార్టీల విమర్శలు వేడి ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలైన పురందరేశ్వరి – వైసీపీ రాజ్యసభ మెంబెర్ అయిన విజయసాయి రెడ్డి మధ్య రాచుకుంది.
గడిచిన నెల రోజుల నుండి పురందరేశ్వరి పై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారు వైసీపీ నేత విజయ సాయి.గుడ్ మార్నింగ్ తో మొదలయ్యే డైలీ న్యూస్ పేపర్ మాదిరి తన సోషల్ మీడియాలో తెల్లవారగానే పురంధరేశ్వరిని విమర్శిస్తూ ఎదో ఒక ట్వీట్ తో విజయసాయి తన దిన చర్యను ప్రారంభిస్తున్నారు.అలాగే గుడ్ నైట్ విషెస్ లా మరో ట్వీట్ తో ముగిస్తున్నారు.
తనను ఇంతలా టార్గెట్ చేస్తున్నా పురందరేశ్వరి మాత్రం విజయ సాయి రెడ్డిని కనీసం పట్టించుకోను కూడా పట్టించుకోవడం లేదనే చెప్పాలి.ఆయన తన వెంట పడితే ఆమేమో జగన్ ను తగులుకున్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం లిక్కర్ మాఫియాగా తయారయ్యిందని, కల్తీ మద్యం అమ్మకాలతో జగన్ ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో వ్యాపారం చేస్తుందని, మద్యం అమ్మకాలతో వచ్చే ఆదాయం మొత్తం జగన్ దగ్గరకే చేరుతుందంటూ ముఖ్యమంత్రిపై తీవ్రమైన విమర్శలు చేసింది.
తాజాగా ఇసుక పాలిసీ మీద స్పందిస్తూ పురందరేశ్వరి జగన్ ను టార్గెట్ చేస్తూ మరోసారి తన విమర్శలకు పని చెప్పారు. గత ప్రభుత్వంలో ప్రజలకు ఉచితంగా ఇసుక అందించిన వారి పైన అక్రమాలు చేశారు, దోపిడీ జరిగిందంటూ కేసులు పెట్టిన ఈ ప్రభుత్వం ఇప్పుడు ఇసుకను అక్రమ రవాణా ద్వారా సప్లై చేస్తూ ఎంత మొత్తంలో దోపిడీకి పాల్పడిందో చెప్పాలంటూ నిలదీశారు. ఈ ఇసుక మాఫియాతో సంపాదించినా సొమ్మంతా తాడేపల్లి పాలసీకి చేరుతుంది అంటూ జగన్ పై ఆరోపణలు చేశారు.
నేనెప్పుడూ ఇలాంటి ఇసుక దోపిడీ చూడలేదు. “దాచుకో దోచుకో”…అన్నవిధంగా ఈ రాష్ట్రంలో ఇసుక దందా జరుగుతుంది. హరిత ట్రిబ్యునల్ ఆదేశాలను బేఖాతరు చేసి వైసీపీ నాయకులు చేస్తున్న ఇసుక దందాకు అడ్డుకట్టవేయాల్సిన సమయం వచ్చింది అంటూ ప్రజలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు వైసీపీ ప్రభుత్వం మీద చేస్తున్న విమర్శలను పట్టించుకుని తిరిగి సమాధానం చెప్పే వైసీపీ నాయకులే కరువయ్యారు.అలాగే పురందరేశ్వరిపై విజయ సాయి రెడ్డి చేస్తున్న విమర్శలకు కౌంటర్ వేసే నేతలు బీజేపీ లో మచ్చుకైనా కానరావడం లేదు.
ఇలా విజయ సాయి నిన్ను వదలా..అంటూ పురందరేశ్వరి వెంట పడుతుంటే నీతో నాకేంటి అంటూ పురందరేశ్వరి తన రాజకీయం తానూ చేసుకుంటూ పోతుంది. అలాగే పురందరేశ్వరి వైసీపీ ప్రభుత్వ దోపిడీని వదలకుండా విమర్శిస్తుంటే నీతో మాకేంటి అంటూ వైసీపీ ప్రభుత్వం కూడా తన దోపిడీ తానూ చేసుకుంటూ పోతుంది. ఇలా వాళ్ళు వాళ్ళు విమర్శించుకుంటూ బాగానే ఉన్నారు మధ్యలో దోపిడీకి గురయ్యేది అమాయకపు ప్రజలే.




