ఇటీవలే కడప ఉక్కు కర్మాగారం కోసం 11 రోజులపాటు నిరాహారదీక్ష చేసిన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ కడప ఉక్కు కర్మాగారం నిర్మాణం కోసం తలపెట్టిన దీక్షను కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ద్రవ పదార్థాలను మాత్రమే తీసుకుంటున్నట్లు వెల్లడించారు.తొలిసారి గడ్డం తో కనిపించిన రమేష్ కర్మాగారం నిర్మాణానికి పునాది వేసే వరకు గడ్డం తీయనని శపధం చేశారు.
అంతకు ముందు ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సోమవారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆలయానికి చేరుకున్న ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో రమేశ్కు ఆలయ పండితులు వేదాశీర్వచనం పలికి శేషవస్త్రంతో సత్కరించారు. స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
ఆంధ్రప్రదేశ్ లోని కడప, తెలంగాణలోని బయ్యారంలో ఉక్కు కర్మాగారం నెలకొల్పే పరిస్థితి లేదని కేంద్రం సుప్రీం కోర్టులో అఫిడవిట్ సమర్పించిన సంగతి తెలిసిందే. దీనితో వివాదం చెలరేగి రమేష్ దీక్షకు కూర్చున్నారు. కేంద్రం రెండు నెలల్లో ఉక్కు కర్మాగారం నెలకొల్పక పోతే తామే నెలకొలుపుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించి ఆయనతో దీక్ష విరమింప చేశారు.



