డియర్ సిఎం.. డిసెంబర్‌ వస్తోంది… విశాఖ వస్తున్నారా?

CM-Camp-Office-on-Rushikonda,-Vizag

మూడు రాజధానులు పేరుతో మూడేళ్ళు, విశాఖ రాజధాని పేరుతో మరో ఏడాదిన్నర గడిపేసీఎండీ వైసీపి ప్రభుత్వం. కానీ ఆ మూడు, ఒకటే వైసీపిని భూతంలా వెంటాడుతున్నాయి ఇంకా. మూడు రాజధానులతో టిడిపి, జనసేనలను అటు రాయలసీమ, ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలో తిరగనీయకుండా ప్రజల చేతే తరిమి కొట్టిద్దామనుకొంటే, వైసీపి ప్రతిపాదననే ప్రజలు తిరస్కరించారు. కనుక ‘తూచ్! మూడంటే మూడు కాదు… విశాఖ ఒక్కటే రాజధాని’ అని సవరణ చేసి సర్దిచెప్పుకొన్నారు.

అయితే ఈ రాజధాని వ్యవహారం హైకోర్టు, సుప్రీంకోర్టులో ఉండటంతో ‘విశాఖ రాజధాని’ అని కూడా ధైర్యంగా చెప్పుకోలేని దుస్థితి నెలకొంది. కానీ ఎన్నికలు ముంచుకొచ్చేస్తున్నాయి. కనీసం విశాఖ రాజధానిగా ఉంటుందని ప్రజలకు నమ్మకం కలిగించకపోతే ఎన్నికలలో వైసీపి నష్టపోతుంది. అందుకే ‘సిఎం జగన్‌ విశాఖకు మకాం మార్చడమే విశాఖ రాజధాని అని తీర్మానించేశారు.

ADVERTISEMENT

అందుకు జనవరి, మార్చి, జూలై, సెప్టెంబర్‌ ముహూర్తాలు ప్రకటిస్తూ మరో ఏడాది కాలక్షేపం చేసేశారు. చివరాఖరుగా ప్రకటించిన ముహూర్తం డిసెంబర్‌. అంటే వచ్చే నెలే! మరో వారం రోజులే ఉంది. కనుక మళ్ళీ సిఎం జగన్మోహన్‌ రెడ్డికి అధికారులు ముహూర్తం దగ్గర పడిందని గుర్తుచేయవలసిన సమయం ఇది.

విశాఖ రాజధాని అవుతుందో లేదో తెలీదు కానీ ఋషికొండపై భవనాల నిర్మాణం కోసం వైసీపి ప్రభుత్వం సుమారు రూ.433 కోట్లు ఖర్చు చేసింది. అదే సిఎం క్యాంప్ కార్యాలయం అని ప్రకటించి, హైకోర్టు, సుప్రీంకోర్టుకి భయపడి మళ్ళీ కాదని సర్ధి చెప్పుకొంది.

వైసీపి ప్రభుత్వం విశాఖని రాజధాని అని, వందల కోట్లతో నిర్మించిన భవనాలను సిఎం క్యాంప్ కార్యాలయమని ధైర్యంగా చెప్పుకోలేకపోవడం ఎంత దౌర్భాగ్యం?

వాటిని “ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధిని పర్యవేక్షించేందుకు ముఖ్యమంత్రి వచ్చినప్పుడు బస చేసేందుకు వినియోగించే తాత్కాలిక కార్యాలయం’ అని మరో ముసుగు వేస్తోంది. కొండంత ఋషికొండని పరదాలు కప్పి, రేకులు అడ్డం పెట్టి దాచేయాలనుకొన్నట్లే, సిఎం క్యాంప్ కార్యాలయానికి మారుపేర్లు పెట్టినా కోర్టులు గ్రహించగలవు.

సిఎం జగన్‌ అక్కడ బస చేస్తే చేయవచ్చు. కానీ పొరపాటున కూడా ‘విశాఖ రాజధాని’ ఇక్కడి నుంచే రాష్ట్రాన్ని పరిపాలిస్తాను,’ అనే మాట అనకూడదు. అంటే అది కోర్టు ధిక్కరణే అవుతుంది. అదీ సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించడం అంటే కొరివితో తల గోక్కొవడమే.

అలాగని విశాఖ రాజధాని అని ప్రజలకు నమ్మకం కలగించాలంటే ముఖ్యమంత్రి విశాఖకు మకాం మార్చక తప్పదు. డిసెంబర్‌ ముహూర్తం దగ్గర పడింది. కనుక వస్తారో లేక ఏకంగా ఎన్నికల తర్వాత వచ్చేస్తామని చెప్పుకొంటారో వైసీపికే తెలియాలి.

ADVERTISEMENT
Latest Stories