తెలంగాణ ఎన్నికలతో ఆంధ్రప్రదేశ్కు సంబందమే లేదనుకోవచ్చు. కానీ ఆ ఎన్నికలలో పొత్తులు, ఫలితాల ప్రభావం తర్వాత జరిగే ఏపీ శాసనసభ, లోక్సభ ఎన్నికలపై తప్పకుండా పడుతుంది.
ఏపీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలంగాణ ఎన్నికలలో టిడిపి, జనసేనల నిర్ణయాలపై ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు.
శుక్రవారం తెలంగాణలోని కొత్తగూడెం సీపీఐ అభ్యర్ధి తరపున ఎన్నికల ప్రచారానికి వెళ్ళినప్పుడు, ఆయన మీడియాతో మాట్లాడుతూ, “తెలంగాణ ప్రజలు ప్రభుత్వ మార్పు కోరుకొంటున్నారు. డబ్బు మధంతో, అహంకారంతో విర్రవీగుతున్న కేసీఆర్ని గద్దె దించేందుకు కాంగ్రెస్ గట్టిగా ప్రయత్నిస్తోంది. కనుక ఈ సమయంలో టిడిపి వెనక్కు తగ్గాలనే చంద్రబాబు నాయుడు నిర్ణయం సరైనదే అని భావిస్తున్నాము.
అయితే బీజేపీని నమ్ముకొని జనసేనను ఎన్నికల బరిలో దించడం వలన ఆ పార్టీయే నష్టపోతుంది తప్ప బీజేపీ కాదని త్వరలో పవన్ కళ్యాణ్ గ్రహిస్తారు. అలాగే బీజేపీని నమ్ముకొంటే ఏమవుతుందో కూడా త్వరలో ఆయనకే తెలిసి వస్తుంది.
బీజేపీ, బిఆర్ఎస్ పార్టీల మద్య రహస్య అవగాహన ఉందని అందరికీ తెలిసిన విషయం పవన్ కళ్యాణ్కు తెలియదనుకోలేము. కానీ కేసీఆర్ని గెలిపించాలని చూస్తున్న బీజేపీ కోసం పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని, కనుక తెలంగాణ ప్రజలు మార్పు కోరుకొంటున్నారని పవన్ కళ్యాణే స్వయంగా చెపుతున్నారు. కానీ ఆయనే బీజేపీకి, తద్వారా పరోక్షంగా బిఆర్ఎస్ పార్టీకి తోడ్పడుతున్నారు,” అని సిపిఐ కార్యదర్శి రామకృష్ణ అన్నారు.




