జగన్ మీడియా రాజకీయం చేయడానికి ఏ అంశాన్ని విడిచిపెట్టదన్న విషయం మరోసారి రుజువయ్యింది. అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలో అన్ని ప్రయత్నాలు చేస్తున్న జగన్ మీడియాకు ప్రస్తుతం విజయవాడలో జరుగుతున్న అభివృద్ధి పనులలో ‘బొక్కలు’ కనిపించాయి. ఈ అభివృద్ధిలో అవినీతి ఆరోపణలు చేస్తే మళ్ళీ తిరిగి ‘బూమ్ రంగ్’ అవుతాయనుకున్నారో ఏమో గానీ, ఈ సారి అవినీతిని పక్కన పెట్టి దేవుళ్ళను టార్గెట్ చేసుకుని టిడిపిని ఇరుకున పెట్టాలని ప్రయత్నిస్తున్నారు.
విజయవాడలో రోడ్లన్నీ చాలా చిన్నచిన్నవని అందరికీ తెలిసిందే. విభజనకు ముందు అంత రద్దీ ఉండేది కాదు గనుక ఎలాంటి రోడ్లు అయినా నగర వాసులకు ఇబ్బందిని పెట్టలేకపోయాయి. అయితే ప్రస్తుత పరిస్థితి వేరు. విభజన జరిగిన తర్వాత ఏపీలో విజయవాడ నగరమే హైలైట్ అయ్యింది. రాష్ట్రానికి మధ్య ప్రాంతంగా ఉన్న విజయవాడకు పక్కనే రాజధానిని ఎంపిక చేయడంతో పాటు, ప్రస్తుతం ఏర్పాటవుతున్న అన్ని ప్రభుత్వ శాఖలు కూడా విజయవాడ పరిసర ప్రాంతాల్లోనే ఏర్పడ్డాయి.
అదీ గాక, కనకదుర్గమ్మ గుడి వద్ద ఫ్లై ఓవర్ నిర్మాణం చేపట్టడంతో సదరు పరిసర ప్రాంతాల రహదారులన్నీ విస్తీకరణ చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అందులో భాగంగానే విజయవాడ నగర వ్యాప్తంగా ఉన్న ప్రధాన రహదారులన్నీ ఒక్కసారిగా విస్తీకరణకు నోచుకున్నాయి. దీంతో అంతకు ముందు రోడ్ల ప్రక్కనే ఉన్న కొన్ని దేవాలయాలను తొలగించాల్సి వచ్చిందని అధికారులు చెప్తున్నారు. దీనిని ఆసరాగా చేసుకున్న జగన్ మీడియా దేవుళ్ళతో ఏపీ సర్కార్ ను ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తూ కధనాలను ప్రచురించింది.
ఆ కధనం ప్రకారం ఇప్పటికే 30 ఆలయాలను కూల్చివేసారని చెప్పారు. అయితే అసలు విషయానికి వస్తే… కొన్ని ఆలయాలను కూల్చిన మాట వాస్తవమే గానీ, ఆ సంఖ్య రెండెంకలకు మాత్రం చేరలేదని అధికార వర్గాలు చెప్తున్నాయి. లేనిది ఉన్నట్లు అబూత కల్పనలు సృష్టించడంలో జగన్ మీడియా నైపుణ్యత స్పష్టంగా కనపడుతోందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఒక బాధ్యత గల మీడియా సంస్థగా తొలగించిన ఆలయాల వివరాలను ప్రజలకు తెలియజేయడంలో తప్పులేదు. అలా కాకుండా ప్రజలను రెచ్చగొట్టి, అక్కడ 10 తొలగిస్తే దానిని మూడింతలు చూపించి, అందులో రాజకీయ లబ్ధి చేకూరే విధంగా చేయడం మాత్రం బహుశా… అది జగన్ మీడియాకే సాధ్యం అని చెప్పక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే అనేక విమర్శలను ఎదుర్కొంటున్న జగన్ మీడియాకు ఇదేమి కొత్త కాకపోవచ్చు గానీ, చివరికి మతాన్ని అడ్డుపెట్టుకుని కూడా రాజకీయాలు చేయాలని చూడడం మాత్రం ఆహ్వానించదగ్గ పరిణామం కాదు. ఇప్పటికే వైసీపీ అంటే ఒక మతం ముద్ర వేయించుకుంది. ఇపుడు తాజాగా ఇతర మతాలలో విద్వేషాలు రెచ్చగొడితే, పార్టీపై అది పెనుప్రభావం చూపే అవకాశం స్పష్టంగా కనపడుతోంది.



