“రాజధాని ప్రాంతంలో టీడీపీ నేతలు భూములు కొనుగోలు చేశారంటూ పిచ్చి రాతలు రాయిస్తున్న వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి బతుకే ఒక బినామీ బతుకని” ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ఉండే నివాసం, ఆయన ఉపయోగించే కార్లు అన్నీ బినామీవేవని, అయినా రాజధాని ప్రాంతంలో కుటుంబసభ్యుల పేరిట భూములు కొనుగోలు చేస్తే తప్పేమిటని, రాజధాని ప్రాంతంలో వైఎస్సార్సీపీ నేతలు కూడా భూములు కొనుగోలు చేశారని, ఆ విషయాలను సాక్షి ఛానల్, సాక్షి న్యూస్ పేపర్ లో ఎందుకు ప్రస్తావించడం లేదని, రాజధాని ప్రాంతంలో భూములు కొనుగోలు చేసిన వైఎస్సార్సీపీ నేతల చిట్టా తన వద్ద ఉందని, త్వరలోనే బయట పెడతానని ధూళిపాళ్ళ నరేంద్ర తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు.
“నవ్యాంధ్ర రాజధానిలో తనకు భూములు ఉన్నాయని జగన్ నిరూపిస్తే కనుక తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని” ఏపీ మంత్రి రావెల కిషోర్ బాబుప్రకటించారు. “తమ పార్టీలో నుంచి ఎమ్మెల్యేలు వెళ్లిపోతుండటంతో నైరాశ్యంలో ఉన్న జగన్, ఎల్లో జర్నలిజానికి పాల్పడుతున్నారని, గత పదేళ్ల నుంచి తన భార్య రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని, తాము అక్రమ లావాదేవాలు చేయలేదని, తమకు బినామీ ఆస్తులు లేవని, అక్రమాస్తులు ఉన్నాయని నిరూపిస్తే వార్త రాసిన వారికే వాటిని ఇచ్చేస్తానని” రావెల ఓపెన్ ఆఫర్ ప్రకటించారు.
ఇదే బాటలో విజయవాడ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు కూడా ఈ అంశంపై తీవ్రంగా స్పందించారు. రోజా చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టిన బోండా, “ఐరన్ లెగ్ గా పరిణమించిన రోజా విలువల గురించి మాట్లాడటం హాస్యాస్పదమని, వైసీపీ డిమాండ్ చేసినట్లుగా ప్రతి అంశంపై విచారణలు వేసుకుంటూ పోతే, రోజుకో విచారణ కమిటీని వేయాల్సి వస్తుందని, అయినా రాజధాని భూదందాపై వైసీపీ వద్ద ఏమైనా ఆధారాలుంటే వాటిపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేస్తామని” బోండా ప్రకటించారు. ఇలా ఏ తెలుగుదేశం రాజకీయ నాయకుడిని కదిలించినా… ‘సాక్షి’ కధనాలపై తీవ్రంగా స్పందిస్తున్నారు.



