ఎవరెడీ… అంటే దానర్ధం కంటే ముందుగా ఆ బ్యాటరీలు గుర్తు వస్తాయి. అయితే ఏపీ రాజకీయాలలో కూడా ఇలాంటి ఎవరెడీ పార్టీ ఒకటి ఉంది. అదే వైసీపీ.
వైసీపీ ‘ఎవరెడీ’ ఏంటి? వెర్రి కాకపోతేను అనిపించవచ్చు. కానీ కూటమి ప్రభుత్వంలో జనసేనను ఏదో విధంగా రెచ్చగొట్టి బయటకు లాగేస్తే చాలనుకుంటూ అవకాశాలను దొరక బుచ్చుకుని మరీ గట్టిగా, నిరంతరంగా ప్రయత్నిస్తూనే ఉంటుంది కనుక ‘ఎవ్వర్ రెడీ’ లేదా ‘ఎవరెడీ బ్యాచ్’ అని కూడా చెప్పుకోవచ్చు.
ఈసారి త్వరలో జరుగబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దీని కోసం ఉపయోగించుకొబోతున్నట్లు మీడియాలో వస్తున్న కథనాలు సూచిస్తున్నాయి.
ఈ ఎన్నికలలో కూడా చంద్రబాబు నాయుడు మెజారిటీ సీట్లు టీడీపికి కేటాయించుకొని, జనసేన, బిజేపిలకు తీరని అన్యాయం చేసేయబోతున్నారంటూ ఆవేదన చెందుతున్నారు. కానీ ఆవేదన చెండుతున్నవారు ఆ రెండు పార్టీలలో వారు కారు. ఎవరెడీ బ్యాచ్!
కనుక జనసేన శ్రేణులు భగ్గుమంటున్నాయంటూ ఆ పార్టీ శ్రేణులకు ఏం చేయాలో ‘దిశానిర్దేశం’ కూడా చేసేస్తున్నారు. సీట్ల కేటాయింపు విషయంలో కూటమిలో ముసలం ఏర్పడిందంటూ అప్పుడే ముసలం కూడ పుట్టించేశారు.
ఈ ఎవరెడీ బ్యాచ్ గురించి సిఎం చంద్రబాబు నాయుడుకి, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్కి బాగా తెలుసు. కనుక ముందుగా టీడీపిలో ఎవరూ ఎవరూ ఈ సీట్ల కేటాయింపుల గురించి మాట్లాడవద్దని, మాట్లాడి వైసీపీ వలలో చిక్కుకోవద్దని సిఎం చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ కూడా తన పార్టీ శ్రేణులకు ఇలాంటి సందేశమే పంపినట్లు తెలుస్తోంది.
కూటమిలో సీట్ల పంపకాలు ఆ మూడు పార్టీల అంతర్గత వ్యవహారం. కనుక వాటి గురించి ఆ మూడు పార్టీలే మాట్లాడుకొని నిర్ణయించుకోవాలి. ఒకవేళ ఎవరికైనా అసంతృప్తి కలిగితే వారు మాట్లాడినా సహేతుకంగా ఉంటుంది.
కానీ కూటమిలో జనసేనకు తీరని అన్యాయం జరిగిపోతోందంటూ వైసీపీ కన్నీళ్ళు కార్చడమే విశేషం. ఆ కన్నీళ్ళు దేనికో మళ్ళీ చెప్పుకోవాలా?



