వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి కేసుతో ఏపీ ప్రభుత్వానికి ఎటువంటి సంబందమూ లేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి బాంబు పేల్చారు. ఆయన తాడేపల్లిలో అవినాష్ రెడ్డి కేసు గురించి మీడియాతో మాట్లాడుతూ, “అసలు ఈ కేసుతో రాష్ట్ర ప్రభుత్వానికి సంబందం ఏమిటి?ఈ కేసు విషయంలో సిఎం జగన్ ఏనాడూ జోక్యం చేసుకోలేదు. అందుకే సీబీఐ అవినాష్ రెడ్డిని అన్నిసార్లు విచారించగలిగింది. సీబీఐ పిలిచినప్పుడల్లా ఆయన విచారణకు హాజరవుతూనే ఉన్నారు. ఇప్పుడు ఆయన తల్లి ఆరోగ్యం బాగోలేదు. కనుకనే ఓ వారం రోజులు గడువు ఇవ్వాలని కోరుతున్నారు తప్ప ఆయన సీబీఐని తప్పించుకొని ఎక్కడికీ పారిపోవడం లేదు కదా?కనుక ఓ వారం రోజులు గడువు ఇస్తే ఏమిటి నష్టం?
విపక్ష మీడియా రకరకాల పుకార్లు వ్యాపింపజేస్తోంది. ఆయన అరెస్టుకు ప్రభుత్వం సహకరించడం లేదని, అవినాష్ రెడ్డి అనుచరులు కర్నూలులో హాస్పిటల్ చుట్టూ కాపలా కాస్తూ మీడియాపై దాడులు చేస్తున్నారంటూ విపక్ష మీడియా దుష్ప్రచారం చేస్తోంది. ఆయన అరెస్ట్ విషయంలో జిల్లా ఎస్పీ తగిన నిర్ణయం తీసుకొంటారు తప్ప ప్రభుత్వం కాదు. అవినాష్ రెడ్డి ఎటువంటి తప్పు చేయలేదని గట్టిగా నమ్ముతున్నవారు ఆయనను సీబీఐ అరెస్ట్ చేసేందుకు వచ్చిందంటే ఆందోళన చెందడం, ఆయన కోసం హాస్పిటల్ వద్దకు రావడంలో తప్పేముంది?వారిలో ఒకరిద్దరూ ఏదో ఆవేశంలో మీడియా ప్రతినిధులతో వాగ్వాదం చేస్తే, వైసీపీ కార్యకర్తలు మీడియాపై దాడి చేశారంటూ విపక్ష మీడియా దుష్ప్రచారం చేస్తోంది,” అంటూ సజ్జల మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అవినాష్ రెడ్డి కేసుతో ప్రభుత్వానికి సంబందం లేదని సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు యధాలాపంగా అన్నవి కావని భావించవచ్చు. ఈ హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డిని వైసీపీ గట్టిగా వెనకేసుకు వస్తుండటం వలన రాష్ట్ర ప్రభుత్వం తీరని అప్రదిష్ట మూటకట్టుకొంటోంది. ఇక అవినాష్ రెడ్డి వ్యవహారశైలి కూడా రాన్రాను ప్రభుత్వానికి చాలా ఇబ్బందికరంగా మారుతోంది. రెండు రోజులుగా కర్నూలులో జరుగుతున్న హైడ్రామా, దానిపై మీడియా కవరేజ్ వలన ప్రభుత్వం పట్ల ప్రజలలో వ్యతిరేకత పెరిగే ప్రమాదం ఉంటుంది. కనుక ఇంక అవినాష్ రెడ్డిని వదిలించుకోవాలని జగనన్న భావిస్తున్నారేమో?అందుకే సజ్జల ఈ కేసుతో ప్రభుత్వానికి సంబందం లేదంటూ బాంబు పేల్చి ఉండవచ్చనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.



