‘కళాతపస్వి’ అనే బిరుదుకే వన్నె తెచ్చిన ‘విశ్వనాధ్’ గారు..!

K Viswanath Passed Away

తెలుగు సినీ ఇండస్ట్రీ చరిత్రలో ఆయన స్థానం నభూతోనభవిష్యతి అని చెప్పాలి. ఆయన లాంటి దర్శకుడు ఇంతకూ ముందు లేరు ఇకముందు రారు అనడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. అటు దర్శకుడిగా ఇటు నటుడిగా రెండు పాత్రలకు సరైన న్యాయం చేసిన వ్యక్తిగా విశ్వనాధ్ గారు చరిత్రలో మిగిలిపోతారు. ఈరోజు విశ్వనాధ్ గారి జయంతి సందర్భంగా ఆయన గురించి కొన్ని విషయాలు…

ADVERTISEMENT

కొన్ని దశాబ్దాల కిత్రమే సమాజంలో పేరుకుపోయిన అసమానత్వాన్ని, అంటరాని తనాన్ని కళ్లకు కట్టినట్టు చూపించి వాటి ప్రక్షాళనకు తనవంతు బాధ్యతగా ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా సినిమాలు తెరకెక్కించి ప్రజల మన్ననలు పొందారు విశ్వనాధ్ గారు. 1980 లో ఆయన దర్శకత్వంలో వచ్చిన శంకరాభరణం చిత్రం ఎన్నో జాతీయ అవార్డులను, నంది అవార్డులను సొంతం చేసుకుంది.

ఎంతోమంది నటీనటులను తన సినిమాలతో స్టార్లుగా మార్చిన ఘనత విశ్వనాధ్ సొంతం. విశ్వ నటుడిగా పేరుతెచ్చుకున్న కమలహాసన్ కు సాగరసంగమం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గర చేసి ఒక స్టార్ ని చేసారు. ఆయన సినిమాలు సామాన్యుడి జీవితాన్ని అడ్డం పట్టేలా ఉండేవి. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా విశ్వనాధ్ గారి సినిమాలో నటించడానికి ఒప్పుకుంటే ఆ స్టార్ స్టేటస్ ను పక్కలపెట్టాల్సిందే అని మెగాస్టార్ తన స్వయం కృషి, ఆపద్బాధవుడు, రుద్రవీణ, శుభలేఖ సినిమాలతో నిరూపించారు.

ముఖ్యంగా భారతీయ కళలను ప్రోత్సహిస్తూ, వాటి విశిష్టతను, నెపుణ్యాన్ని భావితరానికి అందించడానికి తన సినిమాలనే మార్గాలుగా ఎంచుకుని శంకరాభరణం, స్వర్ణకమలం, సాగరసంగమం, సప్తపది, స్వాతి కిరణం, సిరి వెన్నెల, సిరిసిరి మువ్వా, శృతిలయలు వంటి
ఎన్నో మూవీస్ తో ముందుకొచ్చారు విశ్వనాధ్ గారు. ఒక సినిమ పోస్టర్ చూసి ఇది విశ్వనాధ్ మూవీ అని చెప్పగలిగే స్థాయికి ఆయన దర్శకత్వ ప్రతిభ ఉండేది.

అలాగే నటనలోనూ అంతే హుందాగా నటిస్తూ ఆ పాత్రలో ఆయనను తప్ప మరొకరిని ఊహించలేము అనేలా ఆ పాత్రకు ప్రాణం పోసేవారు విశ్వనాధ్. కమలహాసన్ తో చేసిన శుభసంకల్పం, వెంకటేష్ తో చేసిన కలిసుందాం రా, నాగార్జునతో సంతోషం, బాలకృష్ణతో నరసింహ నాయుడు కానీ మిస్టర్ పర్ఫెక్ట్ లో ప్రభాస్ తో నటించిన సన్నివేశాలు కానీ ఇలా సీనియర్, జూనియర్ అంటూ తేడా లేకుండా నటిస్తూ తన లెగసీని కొనసాగించారు.

తెలుగు సినిమా లెజెండ్స్ లో విశ్వనాధ్ గారి స్థానం ఎప్పటికి పదిలం. తెలుగు తల్లి కళ్ళామ్మతల్లికి కళలను పరిచయం చేసిన ఘనత విశ్వనాధ్ గారిది. దర్శకుడిగా, నటుడిగా, రచయితగా తన జీవితం మొత్తం ఉన్నత విలువలు కలిగిన సినిమాలకే అంకితమిచ్చారు విశ్వనాధ్ గారు. ఇప్పటి తరం ప్రేక్షకులను కూడా కట్టిపడేసే స్థాయిలో ఆయన సినిమాలు నిలవడం నిజంగా అభినందనీయం.

కళాతపస్వి, పద్మశ్రీ, రఘుపతి వెంకయ్య, దాదాసాహెబ్ ఫాల్కే ఇలా ఎన్నో అవార్డులను అందుకున్న విశ్వనాధ్ తన సినిమాలలో ఐదు జాతీయ చలన చిత్ర అవార్డులు, ఏడూ నంది అవార్డులు, పది ఫిలింఫేర్ అవార్డులు అందుకున్నారు. తెలుగు సినిమా ఉన్నంత కాలం విశ్వనాధ్ పేరు చిరస్మరణీయం. అలాగే తెలుగు ప్రజల గుండెలలో ఆయన ఎప్పటికి ఒక చిరంజీవే. అటువంటి వారి అడుగుజాడలలో తెలుగు సినీ పరిశ్రమ మున్ముందుకెళ్లాలని ఆశిద్దాం. అదే ఆయనకు తెలుగు సినీ పరిశ్రమ ఇచ్చే అసలైన నివాళ్లు.

ADVERTISEMENT
Latest Stories