రాజకీయాలలో తరచూ వినిపించే ప్రశ్న… పార్టీ ప్రయోజనాలు ముఖ్యమా దేశ, రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా?అంటే దేశ, రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని అన్ని పార్టీలు పైకి చెప్పుకొన్నప్పటికీ, వాటికి పార్టీ ప్రయోజనాలే ముఖ్యమని వాటి నిర్ణయాలు, వ్యూహాలే తెలియజేస్తుంటాయి. అధికారం చేజిక్కించుకోవడానికి రాజకీయ పార్టీలు ప్రకటించే హామీలు, పధకాలు ప్రభుత్వానికి, ప్రజలకు తలకు మించి భారమని తెలిసి ఉన్నప్పటికీ ప్రకటిస్తుండటమే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు.
ఇప్పుడు పార్టీ ప్రయోజనాలు ముఖ్యమా వాటిని అధినేతల ప్రయోజనాలే ముఖ్యమా? అంటే వాటి అధినేత ప్రయోజనాలే ముఖ్యమని నిరూపించేందుకు పలు ఉదాహరణలు ఉన్నాయి.
తాజాగా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యి జైలు పాలైన తన కూతురు కల్వకుంట్ల కవితని కాపాడుకునేందుకు, 5 ఎంపీ సీట్లను బీజేపీకి అప్పగించేందుకు రహస్య అవగాహన కుదుర్చుకున్నారని తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు.
రాష్ట్రంలో చేవెళ్ళ, మల్కాజ్గిరి, భువనగిరి, జహీరాబాద్, మహబూబ్ నగర్ 5 నియోజకవర్గాలలో కాంగ్రెస్ని ఓడించి బీజేపీని గెలిపించేందుకు ప్రధాని నరేంద్రమోడీతో కేసీఆర్ ఒప్పందం కుదుర్చుకున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. అందుకే ఆ 5 నియోజకవర్గాలలో బిఆర్ఎస్ అభ్యర్ధులు గట్టిగా ఎన్నికల ప్రచారం చేయడం లేదన్నారు.
తెలంగాణలో 5 ఎంపీ సీట్లు గెలుచుకునేందుకు కేసీఆర్ బీజేపీ తోడ్పడితే, ఇందుకు ప్రతిగా మోడీ ప్రభుత్వం, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కల్వకుంట్ల కవితకి ఉపశమనం కలిగిస్తారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
రేవంత్ రెడ్డి చీకటిలో రాయి విసిరారా లేక నిజంగానే బీజేపీ, బిఆర్ఎస్ పార్టీల మద్య నిజంగానే రహస్య అవగాహన కుదిరిందా?ఒకవేళ రేవంత్ ఆరోపణలు నిజమైతే కేసీఆర్ కూతురుని కాపాడుకోగలుగుతారు కానీ బిఆర్ఎస్ పార్టీని కాపాడుకోలేకపోవచ్చు. కనుక కేసీఆర్ కూతురు కోసం ఇంత రిస్క్ తీసుకుంటారా?ఆయనకు వేరే గత్యంతరం లేదు కనుక కూతురు కోసం పార్టీని తాకట్టు పెడతారా? అనేది జూన్ 4న ఫలితాలు ప్రకటించినప్పుడు తెలుస్తుంది.




