ఫిభ్రవరి 28న ఇరాన్ మీద అమెరికా యుద్ధం మొదలుపెట్టింది. దాదాపు నెల రోజుల పాటు ఇరు దేశాల మద్య చాలా తీవ్ర స్థాయిలోనే యుద్ధం జరిగింది. అమెరికాతో చేతులు కలిపినందుకు ఇరాన్ చుట్టూ ఉన్న గల్ఫ్ దేశాలు కూడా భారీ మూల్యం చెల్లించాయి. బాంబులతో దద్దరిల్లిపోతూ, పెద్ద పెద్ద భవనాలు పేక మేడల్లా కూలిపోతూ వందలాది మంది ఇరాన్ ప్రజలు చనిపోతుంటే భయానకమైన వాతావరణం నెలకొని ఉండేది.
కానీ ఇరాన్తో అమెరికా చర్చలకు సిద్దమైనప్పటి నుంచి హర్రర్, యాక్షన్ సినిమాలలో కామెడీ సీన్లతో ప్రేక్షకులను అలరించినట్లుగా, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రోజుకో మాట మాట్లాడుతూ అందరినీ అలరిస్తూనే ఉన్నారు.
హోర్మూజ్ జలసంధి మూత పడితే ప్రపంచంలో చమురు ధరలు పెరిగిపోయి చాలా ఇబ్బంది పడతాయన్న ట్రంప్, ఆ తర్వాత మా హెచ్చరికలకు భయపడి దానిని తెరిచేందుకు ఇరాన్ ఒప్పుకుందన్నారు. మళ్ళీ ఆయనే ఇరాన్ ఒప్పుకోలేదన్నారు.
కనుక దానిని తెరిచేందుకు మిత్ర దేశాలు మాకు సాయపడాలని కోరారు. కానీ సాయపడకపోవడంతో మేమే దానిని తెరుస్తామని ప్రగల్భాలు పలికారు.
మళ్ళీ అంతలోనే మాకు హోర్మూజ్ అవసరమే లేదు. ఇక దానిని పట్టించుకోము. మీ చావు మీరు చావండన్నారు. హోర్మూజ్ మూసేస్తే ప్రపంచ దేశాలు ఇబ్బంది పడతాయన్న ట్రంపే, ఇప్పుడు ఆ జలసంధి గుండా ఒక్క నౌకని కూడా అనుమతించమంటూ అమెరికా యుద్ధ నౌకలతో చమురు నౌకలను అడ్డుకుంటున్నారు.
ఇస్లామాబాద్లో శాంతి చర్చలు విఫలమైతే ఇరాన్ని తుడిచిపెట్టేస్తామని బెదిరించిన ట్రంపే, ఇప్పుడు మళ్ళీ రెండో విడత శాంతి చర్చలు జరుగబోతున్నాయని, అవసరమైతే తాను స్వయంగా పాకిస్తాన్ వెళ్తానన్నారు!
ఇరాన్ శుద్ధి చేసిన యురేనియం అంతా తమకు ఇచ్చేసి బేషరతుగా హోర్మూజ్ జలసంధి ని తెరిచేందుకు అంగీకరించిందని ట్రంప్ గొప్పలు చెప్పుకున్నారు. కానీ ట్రంప్ ఈ మాట చెప్పిన 24 గంటల్లో ఇరాన్ మళ్ళీ హోర్మూజ్ జలసంధిని మూసేసింది!
ట్రంప్ సంతోషపడేందుకు ఏవో పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటారని, ఆయన అలా సంతోషంగా ఉండటమే అందరికీ మంచిదని ఇరాన్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది.
శాంతి చర్చలంటే ఇరుదేశాల ప్రతినిధులు కూర్చొని గంభీరంగా మాట్లాడుకుంటారని అందరికీ తెలుసు. కానీ ఈవిధంగా పరస్పరం జోకులు వేసుకుంటూ చమురు, గ్యాస్ కొరతతో ఇబ్బంది పడుతున్న ప్రపంచదేశాలను అలరిస్తాయని ఎవరూ ఊహించి ఉండరు కదా?




