ఫిభ్రవరి 28న అమెరికా ఇరాన్తో యుద్ధం మొదలు పెట్టింది. ఆ యుద్ధం తమకు ‘వీకెండ్ పిక్నిక్’ వంటిదని ట్రంప్ చెప్పుకున్నారు. కానీ సుమారు రెండు నెలలు గడుస్తున్నా ‘వీకెండ్ పిక్నిక్’ ముగియలేదు. మొదట ఇరాన్ అణ్వాయుధాల గురించి యుద్ధమని చెప్పిన ట్రంప్, ఇప్పుడు హోర్మూజ్ జలసంధి గురించి మాట్లాడుతుండటం గమనిస్తే ఇదొక గమ్యం లేని యుద్ధమని అర్ధమవుతుంది.
మళ్ళీ రేపు ఇస్లామాబాద్లో అమెరికా-ఇరాన్ మద్య శాంతి చర్చలు జరుగబోతున్నాయి. ఈరోజు రాత్రికే తమ ప్రతినిధులు అక్కడికి చేరుకుంటారని ట్రంప్ స్వయంగా చెప్పారు. ఈ యుద్ధంతో తీవ్రంగా నష్టపోయిన ఇరాన్ కూడా శాంతి చర్చలకు మొగ్గు చూపుతోంది.
కానీ ట్రంప్ ధోరణి చాలా విచిత్రంగా ఉంది. హోర్మూజ్ జలసంధి నుంచి వచ్చిన ఇరాన్ సరుకు రవాణా నౌకను అమెరికా యుద్ధ నౌకలు అడ్డుకొని తమ అధీనంలోకి తీసుకున్నాయి. దీనిపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
తమ నౌకని అమెరికా నిర్బందించి శాంతి చర్చలకు పిలవడాన్ని ఇరాన్ తప్పు పట్టింది. అమెరికా ఇలాంటి కవ్వింపు చర్యలు చేపడుతుంటే శాంతి చర్చలు ఎలా సాధ్యమని ఇరాన్ ప్రశ్నించింది.
కానీ ట్రంప్ తీరు మారలేదు. రేపటి శాంతి చర్చలు విఫలమైతే ఇరాన్పై భీకర దాడులు చేసి సర్వ నాశనం చేస్తామని ట్రంప్ హెచ్చరించారు.
కనుక ఇరాన్ నుదుట ట్రంప్ తుపాకీ గురి పెట్టి తమతో శాంతి ఒప్పందం చేసుకోవాలని ఒత్తిడి చేస్తున్నట్లు అర్ధమవుతోంది. కానీ ఇలాంటి ఒత్తిళ్ళకు ఇరాన్ లొంగదని ఇప్పటికే పలుమార్లు నిరూపించింది.
కనుక ట్రంప్ బెదిరింపులు మానుకుంటే తప్ప శాంతి చర్చలు ఫలించక పోవచ్చు. కనుక అంత వరకు ఈ అనిశ్చితి, ప్రపంచ దేశాలకు చమురు, గ్యాస్ కష్టాలు తప్పవు.




