రాజకీయనాయకులు ఒక్కోసారి ఏదో చెప్పబోయి ఏదో మాట్లాడేసి తర్వాత “తూచ్! నేను అలా అనలేదు… మీడియా నా మాటలను వక్రీకరించింది,” అని సర్దిచెప్పుకొనేందుకు ప్రయత్నిస్తుంటారు. కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కూడా అలాగే నోరు జారారు.
నేటి నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉభయగోదావరి జిల్లాలలో వారాహి యాత్ర మొదలుపెట్టడంతో ఆయన స్పందిస్తూ, “పవన్ కళ్యాణ్కు నాయకత్వ లక్షణాలు ఏమాత్రం లేవు. ఓడిపోతామని తెలిసి కూడా పోరాడేవాడే నిజమైన నాయకుడు. అటువంటి నాయకత్వ లక్షణాలు ఉన్నవాడు మా జగనన్న. “యుద్ధంలో ఓడిపోతాము… మనం గెలవలేము… నేను ముఖ్యమంత్రిని కాలేను,” అంటూ కార్యకర్తలను ఆయనే నిరుత్సాహపరుస్తుండటం నాయకత్వ లక్షణమనిపించుకొంటుందా? మా జగనన్న మా అందరికీ ఎల్లప్పుడూ ధైర్యమే పంచారు తప్ప ఇలాంటి పిరికి మాటలు నేర్పలేదు. పవన్ కళ్యాణ్, నారా లోకేష్ మరెవరైనా సరే కాకినాడ నుంచి పోటీ చేసినా నా చేతిలో వారికి ఓటమి తప్పదు. దమ్ముంటే వచ్చి పోటీ చేయండి,” అని సవాల్ విసిరారు.
ద్వారంపూడి ఏమి చెప్పాలనుకొన్నారో అర్దమవుతూనే ఉంది. కానీ వచ్చే ఎన్నికలలో వైసీపీ ఓడిపోతుందని తెలిసి ఉన్నప్పటికీ సిఎం జగన్ అందరినీ ఉత్సాహపరుస్తూ పోరాటానికి సిద్దం చేస్తున్నారన్నట్లు ధ్వనిస్తున్నాయి ఆయన మాటలు.
పవన్ కళ్యాణ్ యుద్ధానికి ముందే ఓటమి ఒప్పేసుకొన్నారని ఆయన చెప్పాలనుకొన్నారు. అయితే పవన్ కళ్యాణ్ గత ఎన్నికలలో ఓటమిని అంగీకరించారు, ఇప్పుడు వాస్తవ రాజకీయ పరిస్థితులు, బలాబలాలను దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి పదవి కోసం డిమాండ్పై చేయకూడదని వెనక్కు తగ్గారు. ఒకవేళ జనసేన సొంతంగా ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన సీట్లు సంపాదించుకోగలదని భావించి ఉంటే తప్పకుండా ముఖ్యమంత్రి పదవి కోరుకొనేవారు. అయితే నేటికీ పవన్ కళ్యాణ్ యుద్ధం విరమించకుండా పోరాడుతూనే ఉన్నారు కనుకనే ద్వారంపూడి వంటి వైసీపీ నేతలు ఆయన గురించి ఇలా మాట్లాడగలుగుతున్నారు కదా?



