1999 ఎన్నికల సందర్భంగా విద్యావంతులు మరియు మేధావులలు రాజకీయాల్లోకి రావాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపుతో తెలుగుదేశం పార్టీలోకి చేరారు మాజీ సిబిఐ డైరెక్టర్ కె విజయరామారావు. అలాగే ఖైరాతాబాద్ టికెట్ ఇచ్చి ప్రోత్సహించారు చంద్రబాబు. ఇక్కడితో ఆగితే ఎలా… వచ్చి రావడంతోనే కాంగ్రెస్ దిగ్గజం పి.జనార్ధన్ రెడ్డిని ఓడించి సంచలనం సృష్టించారు కూడా!
అప్పటి చంద్రబాబు ప్రభుత్వంలో క్యాబినేట్ లోకి తీసుకున్నారు. ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, విజయరామారావు ఒకే సామాజిక వర్గం కావడంతో, అప్పటికే విజయరామారావును క్యాబినెట్ లోకి తీసుకోవడంతో కేసీఆర్ ను కేబినెట్ నుంచి పక్కకు జరిపి డిప్యూటీ స్పీకర్ గా నియమించారు చంద్రబాబు. ఈ పరిణామాలతో కలత చెందిన కేసీఆర్ ‘తెలంగాణా రాష్ట్ర సమితి’ పేరుతో కొత్త పార్టీని స్థాపించారు. అదే పార్టీతో ప్రత్యేక తెలంగాణా కల సాకారం చేసారు.
అలా పరోక్షంగా టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపనకు, ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావానికి విజయరామారావు కారణమయ్యారు. అలంటి విజయరామారావు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి, టీఆర్ఎస్ జెండా పట్టుకోబోతున్నారు. గత కొన్నాళ్లుగా పార్టీ కార్యక్రమాలకు, కార్యకర్తలకు దూరంగా ఉంటున్న విజయరామారావు ఫ్లాష్ బ్యాక్ విని సామాన్య జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు. అయితే ప్రస్తుత రాజకీయాల్లో ఇదంతా సర్వ సాధారణమైపోయింది కదా..!





