ఈసారి 175 సీట్లు మేమే గెలుచుకొంటామని సిఎం జగన్మోహన్ రెడ్డి నమ్మకంగా చెప్పుకోవడం అందరూ వింటూనే ఉన్నారు. అధినేతకు అంత నమ్మకం ఉండటం పార్టీకి మంచిదే. లేకపోతే పక్క చూపులు చూస్తుంటారు. ఈ విషయం కూడా బాగా తెలుసు కనుకనే నిత్యం ఏవో కార్యక్రమాలతో పార్టీలో అందరినీ బిజీగా ఉంచుతున్నారేమో?
జగన్ చెప్పుకొంటున్న ‘175 సీట్ల ముచ్చట’ పార్టీలో అందరూ కూడా అంతే నమ్మకంగా చెప్పుకొంటే వినసొంపుగా ఉండేది. కానీ సజ్జల రామకృష్ణా రెడ్డి వంటి ఒకరిద్దరు తప్ప మరెవరి నోట ఆ ముక్క వినిపించడం లేదు. అంటే పార్టీలో ఎవరి లెక్కలు వారికి ఉన్నాయన్న మాట! కానీ తమ అధినేత ఆజ్ఞని జవదాటలేక అందరూ ‘సామాజిక సాధికార యాత్రల’ కోసం బస్సులెక్కి బయలుదేరితే వారి లెక్కలే సరైనవని స్పష్టం అవుతోంది.
ప్రతీ నియోజకవర్గంలో సభల కోసం వైసీపి నేతలు అట్టహాసంగా ఏర్పాట్లు చేసినా జనాలు రావడం లేదు. ఎక్కడ చూసినా ఖాళీ కుర్చీలే కనిపిస్తున్నాయి. ఇదేదో పార్టీ కార్యాలయంలో తలుపులేసుకొని పెట్టుకొంటున్న మీటింగులు కావు. కనుక ‘గిట్టని మీడియా మిత్రులు’ కూడా వచ్చి ఫోటోలు తీసేసి, దయాదాక్షిణ్యం చూపకుండా ‘బస్సు యాత్రలు… తుస్సు యాత్రలు…’ అంటూ ఏదేదో రాసి పడేస్తారు.
కనుక వీటికీ జనసమీకరణ చేయక తప్పడం లేదు. జనసమీకరణ అంటేనే డబ్బుతో కూడిన వ్యవహారం అని అందరికీ తెలుసు. మీకు ‘సామాజిక సాధికారత కల్పించేశామని’ చెప్పాలనుకొంటే ఎవరూ రావడం లేదు. చేతిలో రెండొందలో ఐదొందలో నోటు పెట్టాల్సిందే. చాలా చోట్ల అదే జరుగుతోంది కూడా. అందుకు ఈ వీడియో సాక్ష్యం.
సంక్షేమ పధకాల పేరుతో నాలుగున్నరేళ్ళుగా లక్షల కోట్లు పంచి పెట్టేసినా ఈ జనాలకి ఇంత పిసరు కృతజ్ఞత లేక పోవడం చాలా బాధాకరం. పేకాట పేకాటే బామర్ధి బామర్దే… అన్నట్లు బస్సు యాత్రలకి కూడా మళ్ళీ వేరేగా డబ్బు పంచిపెట్టాల్సి వస్తోంది.
ఇక మరో విషయం ఏమిటంటే గడప గడపకి, తర్వాత స్టిక్కర్స్ అంటించే కార్యక్రమాలతోనే వైసీపి మంత్రులు, ఎమ్మెల్యేలకు సగం జ్ఞానోదయం అయ్యింది. ఇప్పుడు ఈ బస్సు యాత్రలకి డబ్బిచ్చి జనసమీకరణ చేయవలసి వస్తుండటంతో పూర్తిగా జ్ఞానోదయం అయ్యే ఉంటుంది. కనుక ఇకనైనా 175 సీట్లు మనవే అని అనొద్దని అధినేతకు చెపితే మంచిదేమో?




