పెద్ద నోట్ల రద్దు విషయంలో ముందుగా మోడీని ప్రశంసించిన వారు కూడా, చివరికి వచ్చే పాటికి విమర్శల వర్షం కురిపించడంతో, నోట్ల రద్దు అంశం మోడీ సర్కార్ కు మైనస్ గా మారిపోయింది. సామాన్య ప్రజల అభిప్రాయాలు ఎలా ఉన్నా, దేశ వ్యాప్తంగా ఉన్న ఆర్ధిక నిపుణులు కూడా ఈ నిర్ణయాన్ని సమర్ధించకపోవడం అత్యధిక ప్రాధాన్యతను సంతరించుకునేలా చేసింది. దీనికి తోడు పలు అంతర్జాతీయ సంస్థలు, ప్రముఖులు కూడా ఈ నిర్ణయం వలన భారత్ కు చేకూరే లాభం కన్నా నష్టమే ఎక్కువన్న అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.
అయితే ఎట్టకేలకు మోడీ నిర్ణయానికి మద్దతు పలికిన ఓ వ్యక్తి వెలుగులోకి వచ్చారు. అతనేమీ సామాన్యుడు కాదు, గతంలో రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియాకు గవర్నర్ గా విధులు నిర్వహించిన వ్యక్తి దువ్వూరి సుబ్బారావు. 1991 ఆర్ధిక సంస్కరణల తర్వాత కేంద్ర ప్రభుత్వం తీసుకున్న గొప్ప నిర్ణయాలలో ఒకటిగా అభివర్ణించిన దువ్వూరి, నల్లధనాన్ని వెలికి తీయడంలో ఇది చాలా తెలివైన చర్యగా అభిప్రాయపడ్డారు. బ్లాక్ మనీని ఎంతో నేర్పుగా నాశనం చేయడమేనని మోడీ నిర్ణయానికి పూర్తి మద్దతు పలికారు.
పెద్ద నోట్ల రద్దుపై ఇంకెవరైనా ఇదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తపరిస్తే బహుశా ఇంతటి ప్రాధాన్యత దక్కి ఉండేదేమో గానీ, దువ్వూరి సుబ్బారావు లాంటి వ్యక్తి సమర్ధించడం పరిశీలించదగ్గ విషయమే. అయితే ఈ నిర్ణయం ఫలాలు ప్రస్తుతం సామాన్యుడికి కనిపించే విధంగా ఉండకపోవడంతో, ఇందులో దేశానికి చేకూరే ప్రయోజనం కన్నా, నష్టమే ఎక్కువన్న అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. ముఖ్యంగా ప్రజలను ప్రభావితం చేసే మీడియా వర్గాలు కూడా ఈ నిర్ణయాన్ని సరైన దిశగా ప్రజల్లోకి తీసుకెళ్లలేదనే చెప్పాలి.


