ప్రజల వీక్ నెస్ తో ఆడుకోవడం రాజకీయ నాయకుల లక్షణం. బహుశా ఈ లక్షణాన్ని వ్యాపారవేత్తలు కూడా క్రమక్రమంగా అలవార్చుకుంటున్నారో ఏమో గానీ, తాజాగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘ఫ్రీడం 251’ స్మార్ట్ ఫోన్ తెరవెనుక ‘భాగోతాలు’ ఒక్కక్కోటిగా వెలుగు చూస్తున్నాయి. ఇప్పటికే ఈ సంస్థపై వ్యక్తమైన ఆరోపణలతో వినియోగదారుల నుండి తీసుకున్న సొమ్మును తిరిగి చెల్లించగా, అద్దె కట్టలేని పరిస్థితుల్లో ఉండడంతో సంస్థ కార్యాలయం ఖాళీ అయ్యింది.
అయితే తాజాగా వెలుగుచూసిన అసలు వాస్తవం ఏమిటంటే… ‘ఫ్రీడం 251’ పేరుతో విడుదల చేసిన మొబైల్ అసలు వారు రూపొందించింది కాదట. ‘యాడ్ కం’ అనే సంస్థ నుండి 3600 రూపాయలకు మొబైల్ కొని, ఆ ఫోన్ నే 251 రూపాయలుగా చిత్రీకరించారని నిగ్గుతేలింది. ఈ విషయాన్ని ‘యాడ్ కాం’ అనే సంస్థ స్వయంగా వెల్లడించడంతో విషయం వెలుగు చూసింది. వాస్తవానికి ఫోన్ విడుదలైన రోజునే దాని ప్యానల్ పై ‘యాడ్ కాం’ లోగో కనిపించగా, దానిని శాంపిల్ పీస్ గా చూపామని ‘రింగింగ్ బెల్స్’ సమర్థించుకుంది.
తమ వద్ద నుంచి ఫోన్లను కొనుగోలు చేసి వాటిని అతి తక్కువ ధరకు అందిస్తామని చెప్పిన ‘రింగింగ్ బెల్స్’పై చట్టపరమైన చర్యలకు ఉపక్రమించనున్నట్టు ‘యాడ్ కాం’ వ్యవస్థాపక చైర్మన్ సంజీవ్ భాటియా వెల్లడించారు. గతంలో తాము ఆ సంస్థకు ఫోన్లను విక్రయించామని, అయితే, వారు ఇలాంటి ప్రచారం కోసం వినియోగిస్తారని ఊహించలేదని, సదరు సంస్థ నిర్ణయించిన ధర ఇంతవరకూ తమకు అర్థం కాలేదని భాటియా వాపోయారు. ఈ కధంతా తెలుసుకుని విస్తుపోవడం సగటు వినియోగదారుడి వంతయ్యింది.



