ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అవుతారని వైసీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అయితే వైసీపీ వ్యాఖ్యలకు అంతకు రెట్టింపు స్థాయిలోనే కౌంటర్లు ఇస్తున్నారు టీడీపీ శ్రేణులు.
ఆయన పని ఆయన చూసుకోవడం తప్ప ఎవరి మీద త్వరపడి ఎలాంటి విమర్శలు చేయని నాయకుల్లో గంటా శ్రీనివాసరావు ఒకరు. కానీ ఈరోజు వైసీపీ ప్రభుత్వాన్ని గంటా ఓ రేంజ్ లో విమర్శించారు. ఇక ముఖ్యమంత్రి జగన్ ని అయితే కనీస అవగాహ లేకుండా మాట్లాడుతున్న వ్యక్తిగా గంటా అభివర్ణించారు. జగన్ పై గంటా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి.
గత టీడీపీ ప్రభుత్వంలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కోసం 2700 ఎకరాలు ఉండాలి, అందులో ఒక ఏరో సిటీ కూడా ఉండాలని అని చంద్రబాబు ఆలోచించి భూసేకరణ చేశారని గంటా అన్నారు. కానీ అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ మాత్రం విశాఖపట్నం విమానాశ్రయంలో ప్రయాణికులులేక ఈగలు, దోమలు తొలుకుంటున్నారని, విశాఖ ఎయిర్ పోర్ట్ ని అభివృద్ధి చేయకుండా అంతర్జాతీయ విమానాశ్రయం కోసం మరో కొత్త ప్రదేశాన్ని ఎంపిక చేయడం ఏంటని అప్పుడు జగన్ చేసిన విమర్శలను గంటా గుర్తుచేశారు.
ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి గా ఉన్న వ్యక్తికి కనీసం అవగాహన ఉండాలని, కానీ జగన్ కి డిఫెన్స్ విమానాశ్రయానికి, సివిల్ విమానాశ్రయానికి తేడా తెలియకుండా మాట్లాడుతున్నారని, అసలు ఆరెండింటికి మధ్య ఉన్న వ్యత్యాసం తెలుసా అని జగన్ ని సూటిగా ప్రశ్నించారు గంటా. డిఫెన్స్ ఎయిర్ పోర్ట్ పూర్తిగా డిఫెన్స్ ఆధీనంలో ఉంటుందని, దానికి కొన్ని పరిధులు ఉంటాయని, అవసరం అనుకుంటే డిఫెన్స్ వారి ఆపరేషన్స్ కోసం కొన్ని కొన్ని సార్లు విమానాల రాకపోకలను కూడా నిలిపివేస్తారని, అలాంటి సందర్భాలు గతంలో చాలా చూశామని గంటా అన్నారు.
వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు డిఫెన్స్ నీడలో ఉన్న విశాఖ ఎయిర్ పోర్ట్ ని అభివృద్ధి చేస్తామని చెప్పిన జగన్ కి కనీస అవగాహన లేదని గంటా విమర్శించారు. అప్పుడు అలా మాట్లాడిన జగన్ ఇప్పుడెలా భోగాపురం విమానాశ్రయం అభివృద్ధి చేస్తారని గంటా ప్రశ్నించారు. టీడీపీ హయాంలో సేకరించిన 2700 ఎకరాల్లో 500 ఎకరాలు పక్కన పెట్టి నేడు అదే స్థలంలో శంఖుస్థాపన చేశారని గంటా అన్నారు. అప్పుడు జీఎంఆర్ చంద్రబాబు బినామీ అని విమర్శించిన జగన్, మరి ఇప్పుడెలా జీఎంఆర్ కి కట్టబెట్టారని గంటా ప్రశ్నించారు.
విశాఖపట్నం ఒక ఐటి హబ్ కావాలనే ఆలోచనతో డేటా సెంటర్ ని ఏర్పాటు చేసేందుకు చంద్రబాబు అదాని కంపెనీతో యం.ఓ.యు లు చేశారని, కానీ అదాని డేటా సెంటర్ గురించి జగన్ సొంత పత్రిక అయిన సాక్షిలో ఏం రాశారో గుర్తుచేసుకోవాలన్నారు గంటా. ఊసరవెల్లి కంటే దారుణంగా జగన్ రంగులు మారుస్తున్నారని గంటా విమర్శించారు.
ఇటీవల వైజాగ్ లో సమ్మిట్ నిర్వహించి వందల సంఖ్యలు ఒప్పందాలు, లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని హడావుడి చేశారని, కానీ సమ్మిట్ జరిగి రెండు నెలలు కావొస్తున్నా ఎలాంటి పురిగతి లేదని, కనీసం సమీక్ష కూడా నిర్వహించలేదని గంటా అన్నారు. జగన్ క్యాబినెట్ లో మంత్రులు కనీస అవగాహన లేనివారని, వారికి మేము గౌరవం ఇవ్వదలుచుకోలేదని గంటా అన్నారు.
టిడిపి ప్రభుత్వం లో 2014, 2019 సంవత్సరాల్లో ఐఐఎం, రాయలసీమలో కీయా లాంటి కంపెనీలతో పాటు మరి కొన్ని కంపెనీలు తెచ్చామని, జగన్ ఈ నాలుగేళ్ళ పాలనలో ఏ కంపెనీలు తెచ్చారో వైట్ పేపర్ రిలీజ్ చేయాలని గంటా వైసీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
జగన్ ప్రభుత్వం కొలువుదీరాక టీడీపీ కి అనుకూలంగానో, అభిమానంతోనో ఉన్న సంస్థలపై క్షక సాధించడమే పనిగా పెట్టుకున్నారని జగన్ విమర్శించారు. విశాఖపట్నం అంటే రిషికొండ గుర్తిస్తుందని, దానిని కూడా పూర్తిగా ధ్వంసం చేశారని గంటా విమర్శించారు.
రాజమండ్రి ఎమ్మెల్యే భవాని భర్త, మామలను క్షక్ష సాధింపు చర్యల్లో భాగంగానే సీఐడీని ప్రయోగించి అరెస్ట్ చేయించారని, రాష్ట్రంలో మార్గదర్శి, టీడీపీ ఎమ్మెల్యే భవాని కుటుంబసభ్యుల చిట్ ఫండ్ కంపెనీలే కనబడుతున్నాయా అంటూ జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు గంటా.
సిట్ కి అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వైసీపీ నాయకులు సంకలు గుద్దుకుంటున్నారని, వైసీపీ తలక్రిందులుగా తపస్సు చేసినా చంద్రబాబు ను అరెస్ట్ చేయలేరని గంటా అన్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు, కొల్లు రవీంద్ర, ధూళిపాళ్ల, పట్టాభి లను ఏవిధంగా వేధించారో ప్రజలు అంతా గమనిస్తున్నారని గంటా అన్నారు.
ఇంకా జగన్ ప్రభుత్వానికి కేవలం 300 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయని, తరువాత వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనని, కనీసం ఉన్న ఈ కాస్త సమయంలో అయినా ప్రజల గురించి ఆలోచించి మంచి చేయాలని గంటా అన్నారు.



