ఆగస్ట్ 1వ తేదీన ఉదయం ప్రధాని మోడీ భోగాపురం విమానాశ్రయానికి ప్రారంభోత్సవం చేస్తారనే విషయం తెలిసిందే. ఆరోజు ఉదయం 10.45 గంటలకు ఆయన ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో నేరుగా భోగాపురం విమానాశ్రయానికి చేరుకుంటారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించేందుకు ప్రభుత్వం జోరుగా సన్నాహాలు చేస్తోంది. అయితే 1వ తేదీన ప్రధాని మోడీ విమానాశ్రయాన్ని ప్రారంభోత్సవం చేస్తే, వెంటనే కాకపోయినా రెండు మూడు రోజుల తర్వాత అక్కడి నుంచి విమాన సేవలు ప్రారంభమవుతాయని అందరూ భావిస్తున్నారు. కానీ ఆగస్ట్ 17 నుంచి ప్రారంభమవుతాయని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చెప్పారు.
ప్రస్తుతం వైజాగ్ ఎయిర్ పోర్ట్ నుంచి రాకపోకలు సాగిస్తున్న విమానాలన్నిటినీ కొత్త విమానాశ్రయానికి మళ్ళించేందుకు వీలుగా కొన్ని సాంకేతికమైన మార్పులు చేసేందుకు, కొత్త విమానాశ్రయంలో అన్ని వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తున్నాయని ధ్రువీకరించుకునేందుకు ట్రయల్స్ రన్స్ నిర్వహించేందుకు ఈ ఆలస్యమని తెలుస్తోంది.
ఆలోగా మూడు జిల్లాల నుంచి విమానాశ్రయానికి రాకపోకలు సాగించేందుకుగాను బస్సులు, క్యాబ్ సదుపాయం కల్పించే పనులు కూడా పూర్తవుతాయి.
ఇది కేవలం అంతర్జాతీయ విమానాశ్రయం మాత్రమే కాదు.. దీనికి అనుబంధంగా చాలా ఉంటాయని సిఎం చంద్రబాబు నాయుడు మొదటి నుంచి చెపుతూనే ఉన్నారు. అందుకే ప్రభుత్వం జీఎంఆర్ సంస్థకు అదనంగా భూమి కేటాయించింది కూడా.
ఈ విమానాశ్రయం సమీపంలోనే జీఎంఆర్ ఏవియేషన్ యూనివర్సిటీ ఏర్పాటవుతోంది. రాష్ట్రంలో ఇదే మొట్టమొదటి మరియు పూర్తిస్థాయి యూనివర్సిటీ. విమానయాన రంగంలో పనిచేయలనుకునే యువతకి ఈ యూనివర్సిటీ ఒక వరం వంటిదేనని చెప్పవచ్చు.
అలాగే భోగాపురం విమానాశ్రయం పక్కనే విమానాల మరమత్తులు చేసే అతిపెద్ద మెయింటేనెన్స్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేశారు. మున్ముందు మరిన్ని అనుబంధ సంస్థలు ఏర్పాటు కాబోతున్నాయి.
కనుక ఒక అంతర్జాతీయ విమానాశ్రయానికి ఉండాల్సిన అన్ని హంగులు భోగాపురం వద్ద అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి సమకూర్చుతున్నట్లే!




