జీవో నంబర్:1పై హైకోర్టు తీర్పు అలాగే ఉంటుందేమో?

high courtఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రాజకీయ పార్టీలు ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తూ రోడ్లపై ర్యాలీలు, సభలు, రోడ్ షోలు నిర్వహిస్తున్నాయనే సాకుతో రాష్ట్ర ప్రభుత్వం జనవరి 2న జీవో నంబర్:1 జారీ చేసింది. దాంతో ప్రతిపక్షనేతలకు ప్రజల మద్యకు వెళ్లకుండా కట్టడి చేయాలనే దురాలోచన కనబడుతోందని ఆరోపిస్తూ హైకోర్టులో కొన్ని పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిపై విచారణ పూర్తయినందున హైకోర్టు నేడు తీర్పు వెల్లడించనుంది.

ADVERTISEMENT

అమరావతి రైతులు అరసవెల్లికి పాదయాత్రకు బయలుదేరినప్పుడు రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను గమనిస్తే, జీవో నంబర్:1పై కూడా జగన్ ప్రభుత్వానికి సానుకూలంగానే తీర్పు వచ్చే అవకాశం కనిపిస్తోంది. రైతులు పాదయాత్రకు రాష్ట్ర ప్రజలు జేజేలు పలుకుతుంటే, వైసీపీ నేతలు ఓర్వలేక వారిపై దాడులు చేశారు. పోలీసులతో వారిని అడుగడుగునా అడ్డగించారు. దీంతో రైతులు హైకోర్టుని ఎన్నిసార్లు ఆశ్రయించినా, హైకోర్టు వారికే సుద్దులు చెప్పింది తప్ప వృద్ధులు, మహిళలతో కూడిన రైతు బృందంపై జరుగుతున్న దాడులను నిలువరించలేదు.

ఈ విషయంలో హైకోర్టు కూడా రాష్ట్ర ప్రభుత్వం వాదనలనే నమ్మింది తప్ప ప్రజాస్వామ్యబద్దంగా, శాంతియుతంగా పాదయాత్ర చేస్తున్న రైతుల హక్కులను, ఆత్మగౌరవాన్ని కాపాడలేకపోయిందని ప్రజలు భావించారు. హైకోర్టు సహకారం లభించకపోవడంతో రైతులు మద్యలోనే పాదయాత్రను విరమించుకోవలసి వచ్చింది.

కేవలం 600 మంది రైతులు పాదయాత్ర చేస్తేనే రాష్ట్రంలో అలజడి, అల్లర్లు జరుగుతాయని, శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతాయనే రాష్ట్ర ప్రభుత్వం వితండవాదనలతో ఏకీభవించిన హైకోర్టు, రాష్ట్రంలో ప్రతిపక్షపార్టీలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం రోడ్లపై సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహిస్తూ, ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నప్పుడు శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జీవో నంబర్:1ను తిరస్కరిస్తుందనుకోలేము. రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది కనుక జీవో నంబర్:1ను పాక్షిక ఆంక్షలతో అమలుచేసుకోవచ్చునని తీర్పు చెపుతుందేమో? కానీ ఆ నల్ల జీవో ప్రజాస్వామ్యానికి విరుద్దంగా ఉందని చెపితే సంతోషమే.

ADVERTISEMENT
Latest Stories