ఏపీకి జగన్ ఎందుకు అవసరం?అనే పేరుతో వైసీపి చేపట్టిన తాజా కార్యక్రమంపై అభ్యంతరం చెపుతూ రాష్ట్ర హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది.
ఇది వైసీపి సొంత కార్యక్రమం కాగా దీనిలో ప్రభుత్వోద్యోగులను, అధికారులను కూడా భాగస్వాములుగా చేస్తుండటం, ఈ కార్యక్రమం కోసం ప్రజాధనం ఖర్చు చేస్తుండటంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ జర్నలిస్ట్ కె వెంకయ్య హైకోర్టులో పిటిషన్ వేశారు.
రాష్ట్రంలో వైసీపి అధికారంలో ఉన్నప్పటికీ, ఆ పార్టీ రాజకీయ కార్యక్రమంలో ప్రభుత్వం నుంచి జీతాలు పొందుతున్న అధికారులు, ఉద్యోగులను భాగస్వాములుగా చేయడం చట్టవిరుద్దమని ఆయన తరపు న్యాయవాదులు ఉమేశ్ చంద్ర, నర్రా శ్రీనివాస్ వాదించారు.
ఈ కేసులో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి, సిఎస్, పంచాయితీరాజ్ శాఖ, పురపాలక శాఖ, గ్రామ, వార్డ్ సచివాలయాల అధికారులను ఆయన ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ కేసుపై నేడు విచారణ చేపట్టిన హైకోర్టు, ప్రతివాదులందరికీ కౌంటర్ దాఖలు చేయవలసిందిగా ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసి, తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొనే అధికారిక కార్యక్రమాలలో అధికారులు పాల్గొనడంపై ఎటువంటి అభ్యంతరాలు లేవు. కానీ ‘ఏపీకి జగన్ ఎందుకు అవసరం?’ అని వివరించడానికి అధికారులను, ఉద్యోగులను వాడుకొంటే చట్టవిరుద్దం అవుతుంది.
తెలంగాణ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలలో పాల్గొనందుకు కొందరు ఉపాధ్యాయులు, ప్రభుత్వోద్యోగులు సస్పెండ్ చేయబడ్డారు. అదే నియమనిబందనలు ఏపీలో కూడా వర్తిస్తాయి. కానీ వైసీపి ఒత్తిళ్ళకు తలొగ్గి అధికారులు, ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొనవలసి వస్తోంది.
గడప గడపకి కార్యక్రమం వైసీపి నేతలు చెప్పే మాటలను ప్రజలు నమ్మకపోగా వారిని గట్టిగా నిలదీశారు. కనుక తమ పార్టీ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులను, ఉద్యోగులను భాగస్వాములుగా చేసుకొని వారి చేతే, వైసీపి పాలన అద్భుతంగా ఉందని, కనుక మళ్ళీ జగన్మోహన్ రెడ్డినే గెలిపించాలని చెప్పిస్తే ప్రజలకు నమ్మకం కలుగుతుందని వైసీపి భావించి ఉండవచ్చు.
కానీ రాజకీయ పార్టీల కార్యక్రమాలలో ప్రభుత్వోద్యోగులు పాల్గొనకూడదనే నిబందన ఉద్యోగుల సర్వీస్ నియమావళిలోనే ఉంది. కానీ వైసీపి ప్రభుత్వం దానిని పట్టించుకోకుండా వారిని పార్టీ కార్యక్రమాలకు వాడుకొంటోంది.
దీనిపై ఈవిదంగా కోర్టులో కేసులు మొదలైతే వైసీపి సులువుగా తప్పించుకోగలదు కానీ వాటిలో పాల్గొనే అధికారులు, ఉద్యోగులే అన్యాయం అయిపోతారు. ఈ విషయం వారికీ తెలుసు కానీ వైసీపి ఒత్తిళ్ళు తట్టుకోలేక ఈ కార్యక్రమంలో పాల్గొనవలసి వస్తోంది. కనుక దీనికి హైకోర్టే అడ్డుకట్ట వేయాల్సి ఉంటుంది.




