మంత్రి హోదాలో ఉన్న వ్యక్తికి తన శాఖపై పట్టు, అధికారాలు, అవగాహన లేకపోయినా అదేమీ పెద్ద సమస్య కాబోదని ఏపీలో మంత్రులను చూస్తే అర్దమవుతుంది.
కానీ తమ నియోజకవర్గాలలో పట్టు, పార్టీ అధినేత జగన్ మెప్పు తప్పని సరి. లేకుంటే తలరాతలు మారిపోతాయి… మంత్రి గుడివాడ అమర్నాథ్లాగ!
మంత్రిగా కంటే జగన్ ఆత్మీయుడిగానే ప్రజలలో ఎక్కువ గుర్తింపు కలిగిన గుడివాడ అమర్నాథ్ అనకాపల్లి ఎమ్మెల్యేగా ఉన్నారు. కానీ జగన్ జాబితాలో తన పేరుకి బదులు భరత్ కుమార్ పేరు కనిపించడంతో ఆయన గతుక్కుమన్నారు.
‘ఎందుకిలా నా ఖర్మ కాలిపోయింది… ఎందుకిలా నా తల రాత మారిపోయిందంటూ’ గుడివాడ అమర్నాథ్ కన్నీళ్లు పెట్టుకున్నారు కూడా. కొన్ని రోజుల క్రితం అనకాపల్లి సభకు జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు, గుడివాడ అమర్నాథ్ మళ్ళీ కన్నీళ్ళు పెట్టుకుంటే, “తమ్ముడూ నిన్ను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాను” అని అన్నారే తప్ప టికెట్ ఇస్తానని హామీ ఇవ్వలేదు.
ఇక చేసేదేమీ లేక ‘నా తల రాత జగన్మోహన్ రెడ్డి చేతిలోనే ఉంది. ఆయనే వ్రాస్తారని’ తనకి తాను నచ్చజెప్పుకున్నారు. ఆయన పరిస్థితి చూసి వైసీపిలో వాళ్ళే కాదు… టిడిపి, జనసేన పార్టీలు కూడా చాలా జాలిపడ్డాయి.
కానీ తమ్ముడు కానీ ఆ తమ్ముడుపై జగన్ జాలి చూపిస్తూ ఆయన నుదుటన విశాఖలోని ‘గాజువాక అసెంబ్లీ సీటు’ని వ్రాసేశారు. దాంతో గుడివాడ అమర్నాథ్ మొహంలో మళ్ళీ గుడ్డి వెలుగు కనిపిస్తోందిప్పుడు.
నిజానికి గుడివాడ అమర్నాథ్ గాజువాకకు చెందినవారే. కానీ గత ఎన్నికలలో అనకాపల్లి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. కనుక ఈసారి ఎన్నికలలో మళ్ళీ తన సొంత నియోజకవర్గం గాజువాకకి తిరిగివచ్చేస్తున్నందుకు సంతోషపడుతూనే ఉండాలి.
కానీ ఈ 5 ఏళ్ళలో గాజువాక వైసీపి సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి అక్కడ పాతుకుపోయారు. ఆ తర్వాత ఆయన కుమారుడు తిప్పల దేవన్ రెడ్డి గాజువాక నియోజకవర్గం ఇన్చార్జిగా ఉన్నారు. కానీ వారిద్దరూ పార్టీ మారే ఆలోచనలో ఉండటంతో జగన్ గాజువాక ఇన్చార్జిగా ఉరుకూటి రామచంద్రరావుని నియమించారు.
దీంతో ఇప్పుడు ఆ రెండు గ్రూపుల మద్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఇప్పుడు ఉరుకూటిని తప్పించేసి ఆయన స్థానంలో గుడివాడ అమర్నాథ్ని గాజువాక ఇన్చార్జిగా పంపించారు. వైసీపిలోనే రెండు వర్గాలు కీచులాడుకుంటుంటే గుడివాడ అమర్నాథ్ మూడో గ్రూపు తయారుచేసుకొని వారిద్దరితో పోరాడవలసి ఉంటుంది. టిడిపి, జనసేన, బీజేపీల ఉమ్మడి అభ్యర్ధి, మళ్ళీ గాజువాక నుంచే పోటీ చేయాలనుకుంటున్న జేడీ లక్ష్మినారాయణ తదితరులను కూడా ఎలాగూ ఎదుర్కోవలసి ఉంటుంది. కనుక గుడివాడ అమర్నాథ్ నుదుటన జగన్ వ్రాసింది వరమా… శాపమా?






