తెలంగాణలో తొలిసారిగా 8 స్థానాలకు పోటీ చేసిన జనసేన అన్ని స్థానాలలో డిపాజిట్లు కోల్పోయింది. ఇది ఆ పార్టీకి చాలా అవమానమే. జనసేన ఎందువల్ల ఓడిపోయిందో అందరికీ తెలుసు. నిజానికి జనసేన ఇటువంటి ఫలితాలకు సిద్దపడే బీజేపీ కోసం బరిలో దిగి వీరమరణం పొందిందని చెప్పవచ్చు.
జనసేన గెలిస్తే ఏపీలో టిడిపితో సహా అందరూ సంతోషించి ఉండేవారేమో?కానీ ఓడిపోతే సంతోషించేవారు కూడా ఉన్నారు. వారే వైసీపి నేతలు! తెలంగాణలో కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీల గెలుపోటములపై పెద్దగా స్పందించలేదు. కానీ జనసేన డిపాజిట్లు కోల్పోయినందుకు చాలా సంతోషిస్తున్నారు.
తెలంగాణలో జనసేన ఓడిపోగానే వైసీపి నేతలు ప్రెస్మీట్లు పెట్టి ఆడుకొంటారని ముందే అందరూ ఊహించారు. అనుకొన్నట్లే కోడి, గుడ్డుని కనిపెట్టిన మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రెస్మీట్ పెట్టి జనసేనపై అక్కసు వెళ్ళగ్రక్కారు.
ఆయన నిన్న మీడియాతో మాట్లాడుతూ, “తెలంగాణలో స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసిన బర్రెలక్కకు పడినన్ని ఓట్లు కూడా జనసేన అభ్యర్ధులకు పడలేదు. అందరూ డిపాజిట్లు కోల్పోయారు. పవన్ కళ్యాణ్ ఏ ఊరికి వెళితే అదే తన ఊరు అని చెప్పుకొంటారు. మొన్న తెలంగాణలో, నిన్న విశాఖలో కూడా అలాగే చెప్పుకొన్నారు. అసలు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో మీ నియోజకవర్గం ఏది?చెప్పగలరా?
చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిని చేసేందుకే పవన్ కళ్యాణ్ జనసేనని పెట్టారు. కనుక జనసేన రాజకీయ పార్టీ కాదు. రాజకీయ కాంట్రాక్ట్ పార్టీ. పవన్ కళ్యాణ్ తన సినిమా ఇమేజ్, కులం బేస్ చేసుకొని టిడిపి, చంద్రబాబు నాయుడు కోసమే రాజకీయాలు చేస్తున్నారు తప్ప ఏదో ఓ సిద్దాంతం కాదు,” అంటూ ఇంకా చాలా విమర్శలే చేశారు.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో పోటీ చేసి ఓడిపోతున్న జనసేన పార్టీని చూసి వైసీపి జాలి పడితే అర్దముంటుంది. కానీ జనసేనను, పవన్ కళ్యాణ్ని చూసి భయపడుతుండటమే ఆశ్చర్యం కలిగిస్తుంది. జనసేన తమకు ఏవిదంగానూ పోటీ కాదని వైసీపి నిజంగా నమ్ముతున్నట్లతే, నిత్యం పవన్ కళ్యాణ్ భజన చేయడం ఎందుకు?జనసేన ఏ పార్టీతో పొత్తులు పెట్టుకొంటే వైసీపికి ఎందుకు?అంటే జనసేన వలన తమ పార్టీకి ప్రమాదం పొంచి ఉందని వైసీపి గట్టిగా నమ్ముతోందనే కదా అర్దం.
బర్రెలక్కకు పడ్డ ఓట్లు కూడా జనసేనకు పడలేదు : Gudivada Amarnath – TV9#GudivadaAmarnath #PawanKalyan #apnews #tv9telugu pic.twitter.com/MnrMmH61ER
— TV9 Telugu (@TV9Telugu) December 8, 2023




