గత వైసీపీ ప్రభుత్వ పాలన ఏవిధంగా సాగిందో అందరూ కళ్ళారా చూశారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో అభివృద్ధి, అమరావతిని వద్దనుకొని సంక్షేమ పథకాల పేరుతో ప్రజలకు డబ్బు పంచుతూ వైసీపీకి బలమైన ఓటు బ్యాంకు ఏర్పాటు చేసుకోవాలనుకుంది. కానీ ఆ దురాలోచన వలన ఆ పార్టీ ఎన్నికలలో నష్టపోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా దివాళా స్థితికి చేరుకుంది.
కనుక ప్రజలు మళ్లీ చంద్రబాబు నాయుడుకి అధికార పగ్గాలు అప్పగించారు. ఆయన ప్రజల ఆకాంక్షలు, రాష్ట్ర అవసరాలు అర్థం చేసుకొని తదనుగుణంగా అమరావతి, రాష్ట్రాభివృద్ధిపై దృష్టి పెట్టారు.
తత్ఫలితంగా శరవేగంగా అమరావతి నిర్మాణ పనులు సాగుతున్నాయి. రాష్ట్రానికి లక్షల కోట్ల పెట్టుబడులతో అనేక పరిశ్రమలు, ఐటీ కంపెనీలు వస్తున్నాయి. వాటిలో వేలాది మందికి ఉద్యోగాలు లభిస్తున్నాయి.
ఇదివరకు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అంటే సమాధానం చెప్పుకోలేని దుస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ఇదిగో మా రాజధాని అమరావతి.. అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ ఆంధ్రప్రదేశ్ అని అందరూ గర్వంగా చెప్పుకోగలుగుతున్నారు. ఇందుకు మరో తాజా నిదర్శనం తిరుపతి జిల్లాలో హీరో కంపెనీ ఏర్పాటు చేయబోతున్న గ్లోబల్ పార్ట్స్ సెంటర్.
తిరుపతి జిల్లాలోని శ్రీసిటీ సమీపంలో హీరో మోటోకార్ప్కు ఇప్పటికే ఏడాదికి 15 లక్షల వాహనాలను ఉత్పత్తి చేయగల భారీ ప్లాంట్ ఉంది. ఇప్పుడు జిల్లాలోని సత్యవేడు మండలం మదనపాళెం వద్ద రూ.750 కోట్ల పెట్టుబడితో గ్లోబల్ పార్ట్స్ సెంటర్ ఏర్పాటు చేయబోతోంది. దీనికి సీఎం చంద్రబాబు నాయుడు నేడు శంకుస్థాపన చేయబోతున్నారు.
ఇంతకీ ఈ గ్లోబల్ పార్ట్స్ సెంటర్ అంటే ఏమిటంటే ఇదొక అతిపెద్ద అత్యాధునిక విడిభాగాల తయారీ, నిలువ, పంపిణీ కేంద్రం.
దీనిలో సాధారణ మోటార్ సైకిళ్లు, స్కూటర్లతో పాటు భవిష్యత్ అవసరాలైన ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన కీలక విడిభాగాలను కూడా తయారుచేస్తారు. ఇక్కడ నుంచి దేశవ్యాప్తంగా అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాహనాల తయారీ పరిశ్రమలకు, వాహనాల సర్వీస్ సెంటర్లకు విడిభాగాలు సరఫరా చేస్తారు.
దీనిలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 4,000 మందికిపైగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. కరువు పీడిత రాయలసీమ ప్రాంతంలో శరవేగంగా జరుగుతున్న ఈ పారిశ్రామికీకరణ వలన స్థానిక యువతకు భారీగా ఉద్యోగాలు లభిస్తాయి. కనుక సీమ ప్రజల జీవన ప్రమాణాలు క్రమంగా మెరుగుపడతాయి.
శ్రీసిటీలో హీరో కార్ప్ ప్లాంట్తో పాటు ఇప్పటికే అనేక వాహన తయారీ సంస్థలు ఏర్పాటయ్యాయి. ఇప్పుడు ఈ గ్లోబల్ పార్ట్స్ సెంటర్ కూడా ఏర్పాటు కాబోతోంది. కనుక భవిష్యత్లో తిరుపతి జిల్లా దేశంలోనే ప్రధాన ఆటోమొబైల్ హబ్గా మారే అవకాశం కనిపిస్తోంది.




