రాజధాని ఫైల్స్‌… ఎంతో కష్టపడి ఒక్కరోజే ఆపగలిగారు!

Rajadhani-Files-movie

అమరావతి రైతుల పోరాటాలను, రాజధాని విషయంలో జగన్‌ ప్రభుత్వం తీరుని చూపుతూ తీసిన ‘రాజధాని ఫైల్స్’ సినిమాపై హైకోర్టు స్టే ఎత్తివేసి ప్రదర్శనలకు అనుమతించింది.

ఈ సినిమాలో ఏపీ సిఎం జగన్మోహన్‌ రెడ్డిని, కొందరు వైసీపి ముఖ్యనేతలను అభ్యంతరకరంగా చూపారని కనుక ‘రాజధాని ఫైల్స్’ సినిమా ప్రదర్శనలను నిలిపివేసి, సెన్సార్ బోర్డు మంజూరు చేసిన సర్టిఫికేట్‌ని కూడా రద్దు చేయాలని కోరుతూ వైసీపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి హైకోర్టులో పిటిషన్‌ వేశారు.

ADVERTISEMENT

ఈ పిటిషన్‌పై నిన్న విచారణ చేపట్టిన హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ సినిమా ప్రదర్శనపై స్టే విధించింది. దీంతో నిన్న థియేటర్లలో ఈ సినిమా ప్రదర్శన జరుగుతుండగా రెవెన్యూ అధికారులు, పోలీసులను వెంటబెట్టుకొని వెళ్ళి మద్యలో నిలిపివేయించారు.

ఈ కేసుపై నేడు మళ్ళీ విచారణ జరిపిన హైకోర్టు సెన్సార్ బోర్డు రివైజింగ్ కమిటీ ఇచ్చిన అన్ని ధ్రువపత్రాలను పరిశీలించిన తర్వాత స్టే పొడిగించేందుకు నిరాకరిస్తూ, ‘రాజధాని ఫైల్స్’ సినిమా ప్రదర్శనకు అనుమతిస్తున్నట్లు ప్రకటించింది.

వైసీపి ఎంతో కష్టపడి ఈ సినిమా ప్రదర్శించకుండా ఒక్కరోజు మాత్రమే ఆపగలిగింది. కానీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ‘రాజధాని ఫైల్స్’ సినిమా ప్రదర్శించబడుతోంది.

రాష్ట్రంలో టిడిపి, జనసేనలపై బురద జల్లడానికి ఊహాజనితమైన కధతో తీసిన వ్యూహం, శపధం వంటి సినిమాలకే సెన్సార్ బోర్డు సర్టిఫికేట్, హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పుడు, అమరావతి రైతుల వాస్తవ పోరాటాల ఆధారంగా తీసిన ‘రాజధాని ఫైల్స్’ సినిమా ప్రదర్శనకి అనుమతి లభించకుండా ఉంటుందని వైసీపి నేతలు ఏవిదంగా భావించారో తెలీదు.

రెవెన్యూ అధికారులు, పోలీసులు నిన్న థియేటర్లలో చేసిన హడావుడితో ‘రాజధాని ఫైల్స్’ సినిమాకి మరింత పబ్లిసిటీ లభించింది. ఆ సినిమాలో వైసీపి నేతలను ఆందోళనపరిచే అంతగా ఏముంది?అనే ఆసక్తితో ప్రజలు సినిమా చూసేందుకు క్యూ కడుతున్నారు. మరి ప్రజలందరినీ వైసీపి ప్రభుత్వం అడ్డుకోగలదా? అద్దాల మేడలో కూర్చొని దారినపోయే వారిపై రాళ్ళు విసిరితే మనకే నష్టం అని ‘రాజధాని ఫైల్స్’ సినిమా నిరూపిస్తోంది.

ADVERTISEMENT
Latest Stories