వైఎస్ రాజశేఖర్ రెడ్డి దుర్మరణం వారి కుటుంబానికి తీవ్ర విషాదం కలిగించేదే. అయితే ఆయన అకాల మరణం సమైక్య ఏపీ, తర్వాత విభజిత ఏపీ రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేశాయి.
వైఎస్ జీవించి ఉండి ఉంటే రాష్ట్ర విభజన జరగనిచ్చేవారే కారు. కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీ స్థాపించి ఉండేవారే కారనే వాదనలు నేటికీ వినబడుతూనే ఉంటాయి.
ఒకవేళ ఆయన జీవించి ఉన్నా రాష్ట్ర విభజన జరిగి ఉండి ఉంటే, అప్పుడు ఏపీలో వైసీపితో జగన్ రాజకీయాలలోకి వచ్చి ఉండేవారే కారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ, చంద్రబాబు నాయుడు నేతృత్వంలో టిడిపి ఉండేవి.
అప్పుడు ఎప్పటిలాగే వారిద్దరి మద్యనే ‘ఆరోగ్యకరమైన పోటీ’ కొనసాగుతూ ఉండేది. నేడు రాష్ట్రంలో ఇటువంటి నీచ రాజకీయాలు జరుగుతుండేవి కావు.
వైఎస్ జీవించి ఉండగానే జగన్ ‘క్విడ్ ప్రో’తో అక్రమాస్తులు పోగేసుకున్నారు. కనుక ఒకవేళ ఆయన జీవించి ఉండి ఉంటే వాటిని ఆయన అడ్డుకునేవారో లేదో కానీ వైఎస్ ఉండి ఉంటే బహుశః జగన్పై అక్రమాస్తుల కేసులు నమోదు అయ్యి ఉండేవి కావనే చెప్పవచ్చు.
ఆ కేసులలో జగన్ జైలుకి వెళ్ళాల్సి వచ్చినప్పటికీ వైఎస్ మరణం జగన్కి రాజకీయంగా కలిసి వచ్చిందనే చెప్పొచ్చు.
దీనినే మరోవిదంగా చెప్పుకుంటే జగన్ ‘ఓదార్పు యాత్రలు’ చేసి, తండ్రి మరణాన్ని, సానుభూతిని, తండ్రి సంపాదించుకున్న మంచి పేరుని, ఆయన రాజకీయ బ్రాండ్ ఇమేజ్ని అన్నిటినీ తన రాజకీయ ఎదుగుదలకు బలమైన పునాది నిర్మించుకున్నారు.
రాజకీయాలలో స్థిరపడి తనకంటూ సొంత ఇమేజ్ ఏర్పరచుకునేవరకు జగన్ తండ్రి పేరు చెప్పుకునే రాజకీయాలు చేశారు. కానీ ఒకసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టాక తనని తాను ప్రమోట్ చేసుకోవడం మొదలుపెట్టారు. ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే.
కానీ ఇప్పుడు చెల్లి వైఎస్ షర్మిల తండ్రి పేరును వాడుకునే ప్రయత్నాలు చేస్తుండటంతో జగన్ అప్రమత్తమయ్యి వైసీపి సోషల్ మీడియాలో ప్రతీరోజూ తండ్రి ఫోటోలు, జ్ఞాపకాలు పెట్టిస్తున్నారు.
అంటే తండ్రి బ్రాండ్ ఇమేజ్ మళ్ళీ భవిష్యత్లో అవసరం పడుతుందనే ముందు జాగ్రత్త అనుకోవచ్చు అందుకే తండ్రి బ్రాండ్ ఇమేజ్ని చెల్లితో పంచుకునేందుకు కూడా జగన్ ఇష్టపడటం లేదన్న మాట!
ఒకవేళ వైఎస్ జీవించి ఉండి ఉంటే జగన్కి బదులు ఆయనే ముఖ్యమంత్రి అయ్యి ఉండేవారు. కనుక అప్పుడు జగన్, వైఎస్ షర్మిల ఇద్దరూ రాజకీయాలలోకి వచ్చి ఉండేవారా లేదా? అంటే బహుశః వైఎస్ కూడా కేసీఆర్లాగే తన కొడుకు, కూతురు ఇద్దరినీ రాజకీయాలలో ప్రవేశపెట్టి, జగన్ని వారసుడుగా ప్రకటించి ఉండేవారేమో?కానీ వైఎస్ చనిపోవడంతో రెండు తెలుగు రాష్ట్రాలలో రాజకీయాలు సమూలంగా మారిపోయాయని చెప్పక తప్పదు.






