జగన్‌ దిగిపోయినా అమరావతి కష్టమేనా?

IIT Professors Inspects Amaravati Buildings

జగన్‌ అధికారంలోకి వచ్చే ముందు, వచ్చేక “నేను ఈ లోకంలో ఉన్నా లేకున్నా నా తండ్రి వైఎస్‌తో పాటు ప్రజలు నన్ను ఎప్పటికీ తలుచుకోవాలి. ఆవిదంగా చేస్తాను,” అని చెప్పేవారు. మొదట్లో ఆయన చెప్పే ఈ మాటలను ప్రజలు వేరేలా అర్దం చేసుకునేవారు. కానీ 5 ఏళ్ళ రాక్షస పాలన తర్వాత ఆనాడు జగన్‌ అలా ఎందుకన్నారో ప్రతీ ఒక్కరికీ అర్దమవుతోందిప్పుడు.

ఒక్క ఛాన్స్‌తో ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్‌ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి తాను ఎంతో మేలు చేశానని గొప్పగా చెప్పుకుంటారు. అయితే ఆయన చేసిన అపకారం అంతా ఇంత కాదు కొన్ని లక్షల కోట్లు ఉంటుంది.

ADVERTISEMENT

ఇది ఆయన చేసిన అప్పుల గురించో లేదా తాకట్టు పెట్టేసిన ప్రభుత్వ ఆస్తుల గురించో కాదు. అమరావతిని 5 ఏళ్ళు పాడుబెట్టడం వలన జరిగిన మరో నష్టం.

చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే జగన్‌ నిర్వాకం వలన అమరావతిలో కట్టడాల పరిస్థితి ఏవిదంగా ఉందో తెలుసుకునేందుకు ఐఐటి, హైదరాబాద్‌ నిపుణుల బృందాన్ని రప్పించారు. వారు శుక్రవారం నుంచి అమరావతిలో కట్టడాలను పరిశీలిస్తున్నారు.

అనేక కట్టడాల పునాదుల చుట్టూ 5 ఏళ్ళుగా నీళ్ళు పేరుకుపోయి వాటిలో మునిగిపోయి దెబ్బతిన్నాయి. మరికొన్నిటి ఇనుపచువ్వలు ఎండకు ఎండి వానకు తడిసీ తుప్పు పట్టిపోయాయి. అండర్ గ్రౌండ్ కేబుల్స్ కోసం వేసిన డక్ట్ లలోకి మురికినీళ్ళు చేరడంతో అవి పాడైపోయాయి.

అమరావతిలో జోరుగా భవన నిర్మాణాలు జరుగుతున్న సమయంలో జగన్‌ ఆ పనులన్నిటినీ అర్దాంతరంగా నిలిపివేయడంతో కొన్ని చోట్ల గోడలు పూర్తిగా దెబ్బ తిన్నాయి. అనేక చోట్ల గోడలకు పెద్ద పెద్ద పగుళ్ళు ఏర్పడ్డాయి. ఐదేళ్ళుగా భవనాలను పాడుపెట్టడంతో వాటిలో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతుండేవి. వాటితో అనేక భవనాల నిండా చెత్తాచెదారం పేరుకుపోయి కంపు కొడుతున్నాయి.

జగన్‌ నిర్వాకం వలన అమరావతిలో కట్టడాలకు జరిగిన నష్టం లెక్కవేయడం అంత సులువు కాదు. పూర్తిగా అన్ని పరీక్షలు చేసిన తర్వాతే ఉన్నవాటిని ఏవిదంగా నిర్మించుకొని వాడుకోవచ్చో నివేదిక ఇస్తామని ఐఐటి, హైదరాబాద్‌ నిపుణుల బృందంలో సభ్యుడు ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం చెప్పారు. ప్రస్తుతం ప్రాధమిక పరిశీలన కోసమే వచ్చామని మళ్ళీ మరోసారి అన్ని పరికరాలతో వచ్చి అవసరమైన పరీక్షలు చేస్తామని చెప్పారు.

ముఖ్యమంత్రి హోదాలో రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చాల్సిన జగన్మోహన్‌ రెడ్డి, రాజకీయ కక్షతో అమరావతిని పాడుబెట్టడం వలన ప్రభుత్వం తొందరపడుతున్నా ఇప్పటికిప్పుడు మళ్ళీ పనులు మొదలుపెట్టలేని స్థితి నెలకొంది. అంటే జగన్‌ తాను అధికారంలో లేకపోయినా అమరావతి నిర్మాణం జరుగకూడదనే దురుదేశ్యంతోనే పాడుబెట్టిన్నట్లు స్పష్టమవుతోంది.

ఈ నష్టం ఎంతో తెలీదు కానీ రాజధాని లేకుండా చేయడం వలన రాష్ట్రానికి లక్షల కోట్ల పెట్టుబడితో రావలసిన అనేక పరిశ్రమలు ఇరుగు పొరుగు రాష్ట్రాలకు తరలివెళ్ళిపోయాయి. అదో నష్టం. పరిశ్రమలు లేకపోవడం వలన ఏపీ యువత ఇరుగు పొరుగు రాష్ట్రాలకు, విదేశాలకు వెళ్ళిపోతున్నారు. అదో నష్టం కష్టం. విశాఖ రాజధాని అంటూ వందల కోట్లతో ఋషికొండపై కట్టించిన ప్యాలస్‌లు నిరుపయోగంగా పడి ఉన్నాయి. అదో నష్టం.

రాష్ట్రానికి ఇంత నష్టం చేసిన జగన్‌ సింపుల్‌గా చేతులు దులుపుకు వెళ్ళిపోతుంటే ప్రభుత్వం ఏమీ చేయలేదా? రోడ్లపై, కాలువలలో చెత్త వేస్తే జరిమానా విధిస్తామంటూ పురపాలక సంస్థలు ప్రతీరోజూ ప్రజలను హెచ్చరిస్తుంటాయి. మరి రాష్ట్రానికి ఇన్ని లక్షల కోట్లు నష్టం కలిగించిన జగన్మోహన్‌ రెడ్డి నుంచి ఆ నష్ట పరిహారాన్ని రాబట్టకుండా వదిలేయాలా?

ADVERTISEMENT
Latest Stories