ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కు చెందిన గీత ఆర్ట్స్ సంస్థ కు మరో బ్రాంచ్ ‘జీఏ 2 పిక్చర్స్’ . ఇటీవలే ఆ సంస్థ నిర్మించిన విజయ్ దేవరకొండ గీత గోవిందం చిత్రం వసూళ్ల పై ఆదాయ శాఖ కన్ను పడింది. బంజారాహిల్స్లోని ‘జీఏ 2 పిక్చర్స్’ ప్రాంగణానికి చేరుకున్న హైదరాబాద్ ఐటీ యూనిట్-14 బృందం.. సినిమా వసూళ్లకు చెందిన వివరాల రికార్డులను పరిశీలించింది. పన్ను చెల్లింపుల విషయమై ఆరా తీశారు. కార్యాలయ సిబ్బందితో పాటు నిర్మాణ సంస్థ యాజమాన్యాన్ని అధికారులు ప్రశ్నించినట్టు తెలుస్తుంది.
ఇదే బ్యానర్ గతంలో మరో రెండు సినిమాలు నిర్మించి ఉండటంతో, ఆ రికార్డులను కూడా పరిశీలించినట్లు సమాచారం. అయితే చివరికి ఏం చేశారు అనేది తెలియరాలేదు. పన్ను సంబంధిత విషయాల గురించే ఈ మధ్య అల్లు అరవింద్ సొంతంగా సినిమాలు నిర్మించకుండా తన సంస్థలో పని చేసిన బన్నీ వాసు, ఎస్కెఎన్ వంటి వారితో సినిమాలు నిర్మిస్తున్నట్టు ఐటీ శాఖ దృష్టికి వచ్చినట్టు సమాచారం. జీఏ 2 పిక్చర్స్ బ్యానర్ పై త్వరలో అఖిల్ అక్కినేని, నాగ చైతన్యలతో కూడా సినిమాలు తీయబోతున్నారు.
జీఏ 2 పిక్చర్స్ పై చిత్రాలు నిర్మిస్తున్న బన్నీ వాసు పాలకొల్లు నుండి జనసేన పార్టీ టిక్కెట్టు ఆశిస్తున్నారు. ఇప్పటికే ఆయన అక్కడ పని కూడా మొదలు పెట్టారు. ఈ నెల 15న రాజమహేంద్రవరం లో జరగబోయే భారీ బహిరంగసభ ఏర్పాట్లను ఆయన స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. సభ నిర్వహణ కోసం జనసేన పార్టీ ఏర్పాటు చేసిన ఒక కమిటిలో ఆయనకు కూడా స్థానం దక్కింది. దీనితో ఆయనకు బహుశా సీటు అనేది కన్ఫర్మ్ అని జనసైనికులు అనుకుంటున్నారు.



