టెస్ట్ సిరీస్ ను 3-0 తేడాతో టీమిండియా చేతిలో ఓటమి పాలయిన శ్రీలంక జట్టుకు, ఆదివారం నుండి ప్రారంభం కాబోయే వన్డే సిరీస్ అత్యంత కీలకం కానుంది. అయిదు వన్డేల సిరీస్ లో కనీసం రెండు మ్యాచ్ లలో అయినా విజయం సాధించకుంటే, వచ్చే వరల్డ్ కప్ లో శ్రీలంక నేరుగా అడుగుపెట్టే అవకాశం ఉండదు. ఆఫ్ఘనిస్తాన్, కెన్యా జట్ల మాదిరి క్వాలిఫైయింగ్ మ్యాచ్ లను ఆడి, అందులో గెలిస్తేనే వరల్డ్ కప్ లో అడుగు పెట్టే అవకాశాలు ఉంటాయి. దీంతో ఈ సిరీస్ లో టీమిండియాపై విజయం సాధించడం కన్నా, మొత్తమ్మీద రెండు మ్యాచ్ లు గెలిస్తే… తీవ్ర పరాభవం నుండి శ్రీలంక తప్పించుకున్నట్లవుతుంది.
1996లో చాంపియన్స్ గా నిలిచిన జట్టు డైరెక్టుగా అవకాశాన్ని పొందలేదంటే, అది శ్రీలంక దేశానికే అవమానమని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీంతో ప్రస్తుతం శ్రీలంక భవిష్యత్తు టీమిండియా చేతిలో ఉన్నట్లయ్యింది. ఐసీసీ జట్టు ర్యాంకింగ్స్ లో 114 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్న ఇండియా అదే ర్యాంకును కొనసాగించాలంటే, కనీసం 3-2 తేడాతో శ్రీలంకపై సిరీస్ గెలవాలి. అలాగే ప్రస్తుతం లంక 90 పాయింట్లతో ఉండగా, లంక కింద 78 పాయింట్లతో వెస్టిండీస్ ఉంది. వరల్డ్ కప్ కు పాయింట్ల కటాఫ్ సెప్టెంబర్ నెలాఖరు కాగా, వెస్టిండీస్ జట్టు ఇర్లాండ్ తోనూ వన్డే సిరీస్ ను, ఆపై ఇంగ్లండ్ తో మరో సిరీస్ ను ఆడనుంది.
ఇండియాతో సిరీస్ లో లంక వైట్ వాష్ అయితే, 86 పాయింట్లకు, 4-1 తేడాతో ఓడితే 88 పాయింట్లకు, 3-2 తేడాతో ఓడితే 90 పాయింట్లకు చేరుతుంది. కనీసం రెండు మ్యాచ్ లు గెలిస్తేనే విండీస్ కన్నా మెరుగైన స్థితికి లంక చేరుతుంది. లేకుంటే, ర్యాంకింగ్ పరంగా విండీస్ కన్నా కిందకు దిగజారి, క్వాలిఫయ్యింగ్ పోటీలు ఆడక తప్పదు. కాగా ర్యాంకింగ్స్ లో టాప్ 6లో ఉన్న ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇండియా, పాకిస్థాన్, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్ లతో పాటు పోటీలకు ఆతిథ్యమిచ్చే ఇంగ్లండ్ ఇప్పటికే క్వాలిఫై కాగా, వచ్చే నెలాఖరుకు టాప్-8వ స్థానంలో ఉండే జట్టు కూడా చోటు సంపాదించుకుంటుంది.
రెండు స్థానాలకూ వచ్చే సంవత్సరం మార్చి, ఏప్రిల్ మధ్య క్వాలిఫయర్ పోటీలు జరుగుతాయి. ఇప్పుడిక వెస్టిండీస్, శ్రీలంక జట్లలో ఏది ముందడుగు వేసి డైరెక్ట్ గా క్వాలిఫై అవకాశాన్ని పొందుతుందన్న విషయమై ఆసక్తి నెలకొని వుంది. ఇక ప్రస్తుత సిరీస్ కు వస్తే… దంబుల్లా వేదికగా జరగనున్న ఈ గ్రౌండ్ లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి తన తొలి మ్యాచ్ ఆడి 12 పరుగులు చేసాడు. ఇప్పుడు అదే కోహ్లి కెప్టెన్ గా బరిలోకి దిగుతుండటం గమనార్హం. ఈ తొమ్మిదేళ్లలో 189 వన్డేల్లో 8257 పరుగులు చేసిన కోహ్లీ, 28 సెంచరీలు, 43 హాఫ్ సెంచరీలు సాధించి, ప్రపంచ అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా స్థానం సంపాదించుకున్నాడు.


