దేశంలో మోడీని, బీజేపీని వ్యతిరేకించే ప్రాంతీయ, జాతీయ పార్టీలన్నీ ఏకమయ్యి ఇండియా పేరుతో ఓ కూటమి ఏర్పాటు చేసుకొన్నాయి. రెండు పార్టీలు పొత్తులు పెట్టుకొని సీట్లు సర్దుబాట్లు చేసుకొని ముందుకు సాగడమే ఎంతో కష్టం. అలాంటిది సుమారు 20కి పైగా పార్టీలు కలిసి కూటమి ఏర్పాటు చేసుకొంటే మరెంత కష్టమో ఊహించుకోవచ్చు.
మోడీని గద్దె దించడమే తమ లక్ష్యం అని చెప్పుకొంటున్నప్పటికీ, ప్రధానమంత్రి కల నెరవేర్చుకోవడం కోసమే మమతా బెనర్జీ, నితిశ్ కుమార్, రాహుల్ గాంధీ వంటివారు కూటమిలో చేరారు. కనుక నిర్ధిష్టమైన సిద్దాంతం, ఆలోచనలు, వ్యూహాలు, ఉమ్మడి కార్యాచరణవంటివేవీ లేకుండా ముందుకు సాగుతోందని తాజా ఎన్నికలు నిరూపించి చూపాయి.
మోడీని గద్దె దించాలనుకొన్నప్పుడు, ముందుగా బీజేపీకి కీలకమైన మధ్యప్రదేశ్, ఛత్తీస్ఘడ్, రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాల శాసనసభ ఎన్నికలలో ఇండియా కూటమి కలిసికట్టుగా సాగి ఉంటే విజయం సాధించి ఉందేవేమో?కానీ శాసనసభ ఎన్నికలు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఇండియా కూటమి గుర్తుకు రాన్నట్లుంది. ఒంటరిగా పోయి బోర్లా పడింది.
తెలంగాణలో ఇండియా కూటమి ప్రస్తావన రానపట్టికీ, కాంగ్రెస్ పార్టీకి వామపక్షాలు మద్దతు ఇవ్వడం చాలా కలిసి వచ్చింది. తెలంగాణలో అన్ని పార్టీలు కలిసికట్టుగా పోరాడటం వలననే కేసీఆర్ని గద్దె దించగలిగామని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ,తెలంగాణ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్న మాటలు నూటికి నూరు శాతం నిజమే.
కానీ మధ్యప్రదేశ్, ఛత్తీస్ఘడ్, రాజస్థాన్ మూడు రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ ఈవిదంగా కూటమిలో పార్టీలను ఎందుకు కలుపుకుపోలేదంటే అక్కడ ప్రాంతీయ పార్టీలు బలంగా లేవు. అధికారంలో కూడా లేవు కనుకనే అనుకోవచ్చు.
కనుక కూటమిలో భాగస్వామ్య పార్టీలకు సీట్లు ఎందుకు పంచి ఇవ్వాలనే దురాశతో కాంగ్రెస్ ఒంటరిగా పోయి బోర్లా పడిందని చెప్పక తప్పదు.
అంటే నేటికీ కాంగ్రెస్ పార్టీ తనను తాను పెద్దన్నగానే భావిస్తోంది తప్ప అన్నిటినీ కలుపుకుపోవాలని భావించడం లేదని ఈ ఎన్నికలతో స్పష్టమయ్యింది. ఈ దురాశ వలననే లోక్సభ ఎన్నికలకు ముందు వచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని కాంగ్రెస్ జారవిడుచుకొందని చెప్పక తప్పదు. కనుక దీనికి లోక్సభ ఎన్నికలలో మళ్ళీ మూల్యం కూడా చెల్లించడం ఖాయమే అని భావించవచ్చు.
కాంగ్రెస్ తీరుతో విసిగిపోయిన బిహార్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రులు నితీశ్ కుమార్, మమతా బెనర్జీలతో సహా పలువురు కూటమి నేతలు రేపు ఢిల్లీలో జరుగబోయే ఇండియా కూటమికి రాలేమని చెప్పేశారు. దీంతో కూటమి సమావేశం వాయిదా పడింది… అని అనేకంటే అప్పుడే విచ్ఛిన్నం మొదలైందని చెప్పుకోవచ్చు.
నాలుగు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలలో ఇండియా కూటమి ఉనికి చాటుకోలేకపోవడంతో లోక్సభ ఎన్నికలలో బీజేపీకి అడ్డుతొలగిపోయిన్నట్లే. మరోసారి నరేంద్రమోడీ నేతృత్వంలో బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రావడం కూడా ఖాయమైనట్లే.




