ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న నీటిపారుదల ప్రోజెక్టులపై జరిపిన సమీక్షా సమావేశంపై ఆంధ్రజ్యోతి పత్రిక ఆసక్తికరమైన వార్త ప్రచురించింది. సీఎం కేసీఆర్ శనివారం ప్రగతి భవన్లో సాగునీటి ప్రాజెక్టులపై సమగ్ర సమీక్ష చేపట్టారు. ఈ సమీక్ష దాదాపుగా ఏడు గంటలు సాగింది. అయితే ఈ సమీక్ష సమావేశానికి హరీష్ రావు హాజరు కాలేదు. ఆ శాఖతో ప్రస్తుతమే కాకుండా, లోగడ కూడా ఎటువంటి సంబంధం లేని కరీంనగర్ ఎంపీ బి.వినోద్కుమార్, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాత్రం ఈ భేటీలో పాల్గొనటం విశేషం.
[m9ad]
హరీష్ ప్రస్తుతం నీటిపారుదల శాఖకు మంత్రి కానప్పటికీ, ఇన్నాళ్లు ఆ శాఖలో పని చేసిన వ్యక్తిగా కనీసం సిద్దిపేట ఎమ్మెల్యే హోదాలోనూ ఈ భేటీలో పాల్గొనకపోవటం చర్చనీయాంశమైంది. సర్కారు ఏర్పడిన మొదట్లో ప్రాజెక్టుల రీడిజైనింగ్పై కేసీఆర్ జరిపిన కొన్ని సమావేశాల్లో మాత్రమే హరీశ్ పాల్గొనలేదు. రీడిజైనింగ్ తర్వాత సాగునీటి శాఖపై సీఎం నిర్వహించిన ఏ సమీక్ష సమావేశమూ హరీశ్ రావు లేకుండా జరగలేదు. దీనితో హరీష్ ను ఆ శాఖ నుండి తప్పించబోతున్నారా అనే చర్చ జరుగుతుంది.
హరీష్ స్థానంలో వేముల ప్రశాంత్ రెడ్డిని కేబినెట్ లోకి తీసుకుని ఆయనకు కీలకమైన ఆ శాఖను అప్పగిస్తారా అనే చర్చ జరుగుతుంది. ఆయనకు మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ గా పనిచేసిన అనుభవం ఉంది. అయన సామర్థ్యంపై కేసీఆర్ కు అపార నమ్మకం ఉందంట. మరోవైపు హరీష్ కు ప్రస్తుతానికి ఏదో ఒక ప్రాధాన్యత లేని శాఖను కేటాయించి మరో ఐదు నెలలలో జరగబోతున్న పార్లమెంట్ ఎన్నికలలో ఆయనను మెదక్ పార్లమెంట్ కు నిలబెట్టాలని కేసీఆర్ భావిస్తున్నట్టు కధనాలు వస్తున్నాయి.
ఇటీవలే కేటీఆర్ ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటు పదవిని ఇవ్వడం, అదే సమయంలో హరీష్ ప్రాధాన్యత తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయి అనే వార్తలు రావడంతో అటు ప్రభుత్వ వర్గాలలోనూ పార్టీ వర్గాలలోనూ చర్చకు దారి తీస్తుంది. అయితే పార్టీ నుండి హరీష్ ను తప్పించడం జరిగితే ఆ ప్రక్రియ సాఫీగా జరుగుతుందా అనేది చూడాలి. ఇప్పటికే హరీష్ అభిమానులు ఎక్కువ సంఖ్యలో ఆయన బంజారా హిల్స్ నివాసానికి రావడం గమనార్హం. అయితే మేనమామపై హరీష్ కు ఉన్న ప్రేమ పార్టీ పట్ల ఆయనకు ఉన్న కమిట్మెంటుపై తెరాసలో ఎవరికీ అనుమానాలు లేవు.



