ఇరాన్ – ఇజ్రాయిల్ మధ్య మొదలైన యుద్ధం అమెరికా రంగ ప్రవేశంతో ప్రపంచ దేశాలను ప్రభావితం చేసింది. ఇజ్రాయిల్ కు మద్దతుగా యుద్ధంలోకి ఎంటర్ అయిన అమెరికా ఆ తరువాత ఆ యుద్దాన్ని ఇరాన్ – అమెరికా అనేలా ముందుకు తీసుకెళ్లింది.
ఈ మూడు దేశాల మధ్య సాగుతున్న యుద్ధ వాతావరణం కు తోడు అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ చేస్తున్న ప్రకటనలు, తన ట్రూత్ వేదిక గా చేస్తున్న పోస్టులు ప్రపంచ దేశాలను ఆందోళనలోకి నెడుతున్నాయి. యుద్ధ ప్రభావంతో ఇప్పటికే భారత్ తో సహా పలు దేశాలు ఇంధన కొరతతో ఇబ్బందులు పడుతున్నాయి.
వంట గ్యాస్ విషయంలో డిమాండ్ కి తగ్గ సరఫరా లేక పలు హోటల్స్, రెస్టారెంట్స్, పీజీ లు, హాస్టల్స్ వంటివి కొన్ని తాత్కాలికంగా మూతబడ్డాయి, మరికొన్ని లిమిటెడ్ ఫుడ్ తో అలా అలా మేనేజ్ చేస్తూ వస్తున్నాయి. అలాగే వంట గ్యాస్ ధరలు కూడా భారీగా పెరగడంతో ఇటువంటి కమర్షియల్ హోటల్స్ లో ఫుడ్ ధరలు కూడా అమాంతం పెరిగిపోయాయి.
పెట్రోల్, డీజిల్ వంటి వాటి మీద ప్రస్తుతానికి భారత ప్రభుత్వం వినియోజాదారుల మీద భారం పడకుండా చూసుకుంటున్నప్పటికీ ఇక వాటి ధరలు కూడా రేపోమాపో రెక్కలు రావడం ఖాయంగా కనిపిస్తుంది. ఇవన్నీ ఒకరకమైన సమస్యలైతే అసలు దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రతిరూపం గా ఉండే భారతీయ స్టాక్ మార్కెట్ ఈ యుద్ధ ప్రభావంతో భారీగా పతనమయ్యాయి.
అగ్రరాజ్య అధ్యక్షుడి హోదాలో ఉన్న ట్రంప్ యుద్ధ వాతావరణంలో బాధ్యతారాహిత్యంగా చేస్తున్న ప్రకటనలతో ప్రపంచ స్టాక్ మార్కెట్లను భారీ నష్టాలను చవిచూస్తున్నాయి. రోజు లక్షల కోట్ల సంపద ఆవిరయిపోతూ ఇన్వెస్టర్లను తీవ్ర భయాందోళనలోకి నెడుతుంది.
ఇప్పటికే ట్రంప్ టారిఫ్ ల దెబ్బతో అతలాకుతలైమన మార్కెట్లు కాస్త పుంజుకుని లాభాల బాట పడుతున్నాయి అనుకునే లోపే మళ్ళీ ఇరాన్ యుద్ధం పరిస్థితిని మొదటి తెచ్చింది. దీనితో చోట మోట ఇన్వెస్టర్ల నుంచి కోట్లలో పెట్టుబడులు పెట్టె బడా ఇన్వెస్టర్ల వరకు అందరి పోర్ట్ ఫోలియోలు ఎర్ర సముద్రం మాదిరి ఎరుపెక్కాయనే చెప్పాలి.
మొన్న ఇరాన్ – అమెరికా ల మధ్య పాకిస్తాన్ కేంద్రంగా సాగిన శాంతి చర్చలతో కాస్త పచ్చబడిన మార్కెట్లు అవి విఫలం కావడంతో తిరిగి ఎర్రబడ్డాయి. తాజాగా మరోసారి ఈ రెండు దేశాల మధ్య శాంతి చర్చలు అంటూ ఇరు దేశాలు ప్రకటించడంతో ఎట్టకేలకు దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల బాట పట్టాయి.
మరి ఈ గ్రీన్ ఇలానే ముందుకెళ్లాలి అంటే అది ఇరాన్ – అమెరికా మధ్య సాగుతున్న శాంతి చర్చలు సఫలం కావాల్సిందే. లేకుంటే మార్కెట్లో ఈ పచ్చధనమంతా కూడా యుద్ధ సెగలతో మరోసారి ఎరుపెక్కక తప్పదు అంటున్నారు మార్కెట్ అనలిస్టులు.






