టిడిపి, జనసేన, బీజేపీలు కలిస్తే విజయం సాధిస్తాయని ముందుగా ఎవరు పసిగట్టారు?అని అడిగితే అందరూ చంద్రబాబు నాయుడు లేదా పవన్ కళ్యాణ్ అని సమాధానం చెప్పవచ్చు. కానీ అది సరైన సమాధానం కాదు. జగన్మోహన్ రెడ్డి ముందుగా పసిగట్టారు.
ఏవిదంగా అంటే టిడిపితో జనసేన పొత్తు పెట్టుకున్నప్పుడు చాలామందే వ్యతిరేకించారు. మళ్ళీ బీజేపీతో టిడిపి పొత్తు పెట్టుకున్నప్పుడు కూడా చాలా మందే వ్యతిరేకించారు. జగన్మోహన్ రెడ్డి కూడా వ్యతిరేకించారు. కానీ వివిద వర్గాల ప్రజలు, ఆయా పార్టీల నేతలు, కార్యకర్తలు, అభిమానులు వేరే కారణాలతో వాటి పొత్తులను వ్యతిరేకిస్తే, జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆ మూడు పార్టీలు కలిస్తే తమకు ప్రమాదం కలుగుతుందని, వారి కూటమి విజయం సాధిస్తుందని పసిగట్టారు.
అందుకే దానిని విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నించారు కూడా. సాధ్యం కాకపోవడం మూడు పెళ్ళాలు, దత్తపుత్రుడు, ప్యాకేజ్ స్టార్ అంటూ పవన్ కళ్యాణ్ని రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారు. కానీ జగన్ ఉచ్చులో పవన్ కళ్యాణ్ పడకపోవడంతో, ముద్రగడ పద్మనాభం వంటివారి ద్వారా కాపులను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారు. ఆ ప్రయత్నాలు ఫలించకపోగా బెడిసికొట్టిన్నట్లు ఎగ్జిట్ పోల్స్ సూచిస్తున్నాయి.
బీజేపీతో టిడిపి పొత్తు పెట్టుకున్నా తమకే ప్రమాదమని అందరి కంటే ముందు జగనే పసిగట్టారు. బీజేపీ మీద ప్రేమతో చంద్రబాబు నాయుడు పొత్తుకి, సీట్ల త్యాగం చేయడానికి సిద్దపడలేదని అందరికీ తెలుసు.
ఈసారి ఎన్నికలలో గెలవడం కోసం వైసీపి ఎంతకైనా తెగిస్తుందని చంద్రబాబు నాయుడు కూడా ముందే పసిగట్టారు. కనుక ఆయన కేంద్రం ద్వారా ఎన్నికల కమీషన్ చేత వైసీపి పెట్రేగిపోకుండా కట్టడి చేయించడానికే ఇన్ని విమర్శలను భరించడానికి, త్యాగాలకు సిద్దపడ్డారనే విషయం జగన్మోహన్ రెడ్డే ముందు పసిగట్టారు.
అప్పుడు దగ్గుబాటి పురందేశ్వరి మీద బురద జల్లుతూ ఏపీ బీజేపీలో చిచ్చు పెట్టాలని ప్రయత్నించారు. అదీ సాధ్యం కాలేదు.
ఈవిదంగా కూటమిని విచ్ఛిన్నం చేయడానికి జగన్మోహన్ రెడ్డి చేసిన కుట్రలు, కుతంత్రాలు ఏవీ పనిచేయలేదు కానీ కూటమిపై ఆయన భయాలు, అంచనాలు మాత్రం నూటికి నూరు శాతం నిజం కాబోతుండటం విశేషమే కదా?






