రెండు తెలుగు రాష్ట్రాలలో ఏ మాత్రం ప్రజాబలం లేని బీజేపీ తనకున్న రాజకీయ బలంతో రాజకీయ పార్టీలకు ఉన్న బలహీనతను అలుసుగా తీసుకుని గత ఐదేళ్లుగా తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల మీద ముఖ్యంగా ఆంధ్రపదేశ్ ప్రభుత్వాన్ని తన గుప్పెటలో పెట్టుకుని రాష్ట్రంలో రాజకీయ చదరంగం మొదలుపెట్టింది.
ఇందులో రాజు, మంత్రి వంటి అత్యున్నత అధికారాలన్నీ తన ఆధ్వర్యంలో ఉంచుకుని తాము ఎవరికీ మద్దతుగా నిలబడాలి అనుకుంటారో వారిని శకునిగా చేసుకుని వారి పార్టీ కార్యకర్తలను తమ పార్టీకి సైనికులుగా మార్చుకుంటూ తమ ప్రత్యర్థికి చెక్ పెడుతుంది బీజేపీ.
అయితే ఇన్నాళ్లుగా తన చదరంగంలో శకుని పాత్ర పోషించిన వైసీపీ స్థానంలోకి ఇప్పుడు టీడీపీ, జనసేన పార్టీలు వచ్చి చేరాయి అనుకుంటున్న ఆ రెండు పార్టీల నేతలకు, కార్యకర్తలకు రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలతో తాము శకుని స్థానంలో ఉన్నామా..? లేక వారి చేతిలో చావుదెబ్బ తినబోతున్న భటుడి స్థానంలో ఉన్నామా..? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.
వీరి అనుమానాలకు బలమైన కారణాలు కూడా లేకపోలేదు. గత ఎన్నికలలో వైసీపీకి, బీజేపీకి ఉమ్మడి శత్రువుగా ఉన్న టీడీపీని ఓడించడానికి వీరిద్దరూ తెర వెనుక చేతులు కలిపారని, అందులో భాగంగానే వైసీపీ వ్యవస్థలను తన అదుపులోకి తీసుకుని ఎన్నికలలో లబ్ది పొందినదనేది ఏపీ రాజకీయాలలో విస్తృతంగా ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు అదే వ్యవస్థల సహకారంతో వైసీపీని గద్దె దింపడానికి బీజేపీ తో పొత్తుకు సిద్ధమయ్యాయి జనసేన, టీడీపీ.
అయితే ఈ పొత్తుని ముందుకు తీసుకువెళ్ళడానికి టీడీపీ, జనసేన పార్టీలు తమ నాయకులను ఎన్నో త్యాగాలకు ఒప్పించారు. అలాగే అధికార పార్టీ వేసే అనేక నిందలు మోస్తూ బీజేపీ పట్ల రాష్ట్ర ప్రజలలో ఉన్న వ్యతిరేకతను భుజాన వేసుకుని వారి పార్టీ నేతల గెలుపుకి ప్రచారాలు చేస్తూ బీజేపీ జెండా మోస్తున్నారు టీడీపీ, జనసేన పార్టీల కార్యకర్తలు. అయితే బీజేపీ తనకున్న అధికారాన్ని కూటమి గెలుపు కోసం కాకుండా వైసీపీ విజయం కోసం వాడుతుంది అనే అభిప్రాయం నానాటికి కూటమి మద్దతుదారులతో బలపడుతుంది.
ఇందుకు ఉదాహరణగా రాష్ట్రంలో 2019 నాటి సంఘటనలే 2024 ఎన్నికలలో కూడా పునరావృత్తం కావడం, ఈ ఘటనలతో వైసీపీ రాజకీయ మైలేజ్ కోసం ప్రయత్నించడం, దానికి అనుగుణంగా ఒక్కోఅడుగు వేసుకుంటూ వ్యవస్థలను తనకనుగుణముగా మార్చుకుంటూ వైసీపీ ఎన్నికల ప్రచారం కొనసాగించడం ఈ రెండు పార్టీల శ్రేణులను భయాందోళను గురిచేస్తున్నాయి.
ఇప్పటికే వాలంటీర్ల తో వైసీపీ మొదలుపెట్టిన పిన్షన్ల పంచాయితీ ఒక పక్క, జగన్ పై జరిగిన దాడిలో టీడీపీ నేతల ప్రమేయం ఉందంటూ వైసీపీ చేస్తున్న ప్రచారం మరోపక్క, వ్యవస్థలో ఉన్న ఉన్నతాధికారుల అండ ప్రభుత్వ పెద్దలకు పుష్కలంగా ఉండడం ఇవన్నీ కూటమి పార్టీలను ఇరుకున పెడుతున్న అంశాలు. దీనికి తోడు మోడీ చేస్తున్న ముస్లిం వ్యతిరేక ప్రసంగాలు కూడా కూటమిని బలహీన పరిచే సంఘటనలే కావడంతో బీజేపీ కూటమికి బలమా..? బలహీనతా..? అంటూ టీడీపీ, జనసేన మద్దతుదారులు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.






