ఎన్నికలలో వైసీపి ఘోరపరాజయం పాలైనప్పటి నుంచి ఇంతవరకు జగన్ ప్రజల మద్యకు రాలేదు. మొదట తాడేపల్లి ప్యాలస్లో పార్టీ నేతలతో ఓటమిపై సమీక్షా సమావేశం ‘మమ’ అనిపించేసి ఇడుపులపాయ వెళ్ళారు. అక్కడ కడప జిల్లా నేతలు, కార్యకర్తలతో సమావేశమవుదామనుకుంటే పెండింగ్ బిల్లులు పట్టుకొని కాంట్రాక్టర్లు వెంటపడటంతో అక్కడి నుంచి హెలికాఫ్టర్లో బెంగళూరు వెళ్ళిపోయారు.
అక్కడ విశ్రాంతి తీసుకున్న తర్వాత మళ్ళీ పులివెందుల తిరిగివచ్చి తండ్రి జయంతి వేడుకలను కూడా ‘మమ’ అనిపించేశారు. ఇప్పుడు పులివెందుల ప్యాలస్లోనే ‘ప్రజా దర్బార్’ నిర్వహిస్తూ ప్రజల నుంచి వినతిపత్రాలను స్వీకరించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
అయితే ఇవన్నీ ప్రజల మద్యకు వెళ్ళేందుకు మొహం చెల్లక కాలక్షేపం చేస్తున్నవే. ఈవిదంగా కొన్ని రోజులు కాలక్షేపం చేసిన తర్వాత శాసనసభ సమావేశాలు మొదలవగానే ఏదో పేరుతో పాదయాత్ర మొదలుపెట్టవచ్చు.
గత ఎన్నికలకు ముందు జగన్ గురించి ఎవరికీ పూర్తిగా తెలీదు. జగన్ కూడా తండ్రిలాగే ప్రజలతో మమేకం అవుతూ చక్కటి పాలన అందిస్తారని ప్రజలు బలంగా నమ్మేవారు. అప్పటికి జగన్ వెంట తల్లీ, చెల్లీ కూడా ఉన్నారు. కనుక అప్పుడు జగన్ ఏమి చెప్పినా ప్రజలు నమ్మేవారు.
కానీ 5 ఏళ్ళ పాలనతో జగన్ ఎటువంటివారో ఇప్పుడు రాష్ట్రంలో ప్రతీ ఒక్కరికీ తెలిసివచ్చింది. అదీగాక ఇప్పుడు జగన్ ఎక్కడకు వెళ్ళినా టిడిపి, జనసేన నేతలు, కార్యకర్తలు ఎక్కడికక్కడ నిలదీయకుండా ఉండరు.
ఇవికాక జగన్కు కేసుల బెడద ఉందనే ఉంది. కనుక జగన్ ప్రజల మద్య తిరగడం చాలా కష్టమే. కానీ తిరుగకుండా తాడేపల్లి ప్యాలస్లో కూర్చొని కాలక్షేపం చేస్తే వైసీపి పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది. కనుక ఏదో రోజు, ఏదో పేరుతో జగన్ జనం మద్యకు రాకతప్పదు. నవ్వులపాలు కాక తప్పదు.
కేసీఆర్ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టి అధికారం చేజిక్కించుకునేందుకు ఎంతో కొంత అవకాశం ఉంది. కానీ టిడిపి, జనసేన, బీజేపీ కూటమికి తిరుగులేని మెజార్టీ లభించడంతో జగన్కు ఆ అవకాశం కూడా లేకుండా పోయింది. కనుక వచ్చే ఎన్నికల వరకు కాలక్షేపం చేయడం చాలా కష్టమే. మరి ఏం చేస్తారో… ఎలా చేస్తారో?






