ఎగ్జిట్ పోల్స్ ప్రకారం చూస్తే ఏపీ శాసనసభ ఎన్నికలలో టిడిపి, జనసేన, బీజేపీ కూటమి భారీ మెజార్టీతో విజయం సాధించి అధికారంలోకి రాబోతున్నాయని స్పష్టం అవుతోంది.
ముఖ్యమైన విషయం ఏమిటంటే, టిడిపితో జనసేన పొత్తు పెట్టుకున్నప్పుడు కాపు సామాజికవర్గంతో సహా చాలా మంది పవన్ కళ్యాణ్ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ముద్రగడ పద్మనాభం, హరిరామ జోగయ్యలైతే సరేసరి.
ఆ తర్వాత బీజేపీతో టిడిపి పొత్తు పెట్టుకున్నప్పుడు కూడా టిడిపిని అభిమానించేవారితో సహా పలువర్గాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు.
మూడు పార్టీల సీట్ల సర్దుబాట్లలో టిడిపి కోసం జనసేన, మళ్ళీ బీజేపీ కోసం టిడిపి, జనసేనలు సీట్లు వదులుకోవడాన్ని కూడా పలువురు తీవ్రంగా విమర్శించారు. తప్పు పట్టారు.
మొత్తంగా చూస్తూ ఈ మూడు పార్టీల పొత్తులకు రాష్ట్రంలో అనేకవర్గాలకు ఆమోదం కాలేదని స్పష్టమైంది. కానీ ఎగ్జిట్ పోల్స్ నివేదికలు చూసినప్పుడు, టిడిపి, జనసేన, బీజేపీల కూటమికి చాలా భారీగా ఓటింగ్ శాతం, సీట్లు రాబోతున్నట్లు స్పష్టమైంది.
పొత్తులు సీట్ల సర్దుబాట్లలో కనపడిన వ్యతిరేకత పోలింగ్ సమయానికల్లా ఎలా తగ్గిపోయింది? ఎందుకు తగ్గిపోయింది? అని ఆలోచిస్తే, జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకతే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ప్రభుత్వాన్ని మార్చాలని ప్రజలు ఎప్పుడో మైండ్లో ఫిక్స్ అయిపోయారు. మద్యలో పొత్తుల వలన, వాటి గురించి జగన్తో సహా వైసీపి నేతలు చేస్తున్న దుష్ప్రచారంతో కాస్త అయోమయానికి గురయ్యారు అంతే.
కానీ మూడు పార్టీలు సీట్లు సర్దుబాట్లు చేసుకొని కలిసికట్టుగా ముందుకు సాగుతుండటం చూసిన తర్వాత, జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు వాటి పొత్తులపై తమ అభ్యంతరాలను పక్కనపెట్టి ప్రజలు కూటమిని గెలిపించుకుంటున్నారని స్పష్టం అవుతోంది.
ప్రజలు కూటమిని అంగీకరించడం ఒక ఎత్తు అయితే కూటమిలో భిన్నదృవాల వంటి మూడు పార్టీలు భేషజాలను పక్కన పెట్టి సహకరించుకుంటూ పరస్పరం ఓట్లు బదలాయింపు జరిగేలా చేసుకోవడం ఇంకా గొప్ప విషయమే. అందుకే ఎగ్జిట్ పోల్స్లో మూడు పార్టీల ఓటింగ్ షేర్ శాతం కూడా పెరిగింది. ముఖ్యంగా బీజేపీల ఓటింగ్ శాతం పెరగడం గమనిస్తే టిడిపి, జనసేన నేతలు ఆ పార్టీకి ఎంతగా సహకరించారో అర్దం చేసుకోవచ్చు.
అలాగే పిఠాపురంలో టిడిపి అభ్యర్ధిగా ఎస్విఎస్ఎన్ వర్మ పోటీ చేయవలసి ఉన్నప్పటికీ, ఆ సీటు పవన్ కళ్యాణ్కి కేటాయించడంతో ఆయన మరో ఆలోచన చేయకుండా పవన్ కళ్యాణ్ కోసం ఎంతగానో శ్రమించారు. ఒకానొక సమయంలో వర్మ పోటీ చేస్తున్నారా పవన్ కళ్యాణ్ చేస్తున్నారా? అని పిఠాపురం ఓటర్లకు అనుమానం కూడా కలిగింది.
ఈవిదంగా అందరూ కలిసికట్టుగా పనిచేస్తూ, పరస్పరం సహకరించుకుంటూ ముందుకు సాగుతుండటం వలననే వారి పొత్తులను వ్యతిరేకించినవారికి కూడా వారిపై నమ్మకం కలిగి ఏ పార్టీ అని చూడకుండా కూటమి అభ్యర్ధిగానే చూసి ఓట్లు వేశారు.






