ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి పిఠాపురంలో వైసీపి అభ్యర్ధి వంగా గీతకి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించినప్పుడు, ఆమెను గెలిపిస్తే ఉప ముఖ్యమంత్రిని చేస్తానని ప్రకటించారు. వైసీపి మేధావులు వెంటనే అదో అద్భుతమైన వ్యూహామని తేల్చి చెప్పేశారు.
టిడిపి, జనసేన, బీజేపీల కూటమి గెలిచి అధికారంలోకి వస్తే పవన్ కళ్యాణ్కి ఉప ముఖ్యమంత్రి పదవి లేదా మరేదైనా మంత్రి పదవి ఇస్తారో లేదో చంద్రబాబు నాయుడు చెప్పడం లేదు. మంత్రి పదవులపై టిడిపి, జనసేన చెరో మాట మాట్లాడుతూ తలలు పట్టుకుంటుంటే, జగన్మోహన్ రెడ్డి ఒకే ఒక్క నిమిషంలో వంగా గీతని ఉప ముఖ్యమంత్రిని చేస్తానని వేదికపైనే ప్రకటించేశారని వైసీపి మేధావులు గొప్పగా చెప్పుకున్నారు.
అంటే వంగా గీత లేదా పిఠాపురం ప్రజల మీద ప్రేమాభిమానాలతో కాదు. పిఠాపురం ప్రజలను వైసీపివైపు తిప్పుకొని పవన్ కళ్యాణ్ని ఓడించేందుకే జగన్ వ్యూహాత్మకంగా ఈ ప్రకటన చేసిన్నట్లు వైసీపి మేధావులే స్పష్టం చేశారు.
అయితే జగన్మోహన్ రెడ్డి ఇటువంటి వ్యూహం ఈ 5 ఏళ్ళుగా అమలుచేస్తూనే ఉన్నారు. ‘పేద ప్రజలకు మేలు చేయడం కోసమే సంక్షేమ పధకాలు’ అని ఇంతకాలం చెప్పుకున్న జగన్, వైసీపి నేతలు ఎన్నికలు దగ్గర పడ్డాక, ‘మీకు సంక్షేమ పధకాల పేరుతో డబ్బు ముట్టజెప్పాము కనుక ఎన్నికలలో మాకే ఓట్లు వేసి గెలిపించమని’ అడగడం అందరూ విన్నారు.
ఇప్పుడు పిఠాపురంలో కూడా అదే ట్రిక్ ప్లే చేశారని అనుకోవవచ్చు. కానీ పవన్ కళ్యాణ్ని ఓడించేందుకు జగన్ ఎన్ని హామీలు ఇచ్చినా, పిఠాపురంలో ఎంత డబ్బు వెదజల్లినా, ఓటర్లపై ఎంత ఒత్తిడి చేసినా పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని తేలిపోయింది.
పవన్ కళ్యాణ్ ఎన్నికలలో గెలిచిన తర్వాత పిఠాపురంలో ఉండరు హైదరాబాద్ వెళ్ళిపోతారని, ఆయన నియోజకవర్గానికి ఏమీ చేయరని జగన్ ఆరోపించారు. కనుక ఎన్నికలలో గెలిచిన తర్వాత జగన్, వంగ గీత, వైసీపి నేతల ఆరోపణలు తప్పు అని పవన్ కళ్యాణ్ నిరూపించి చూపాల్సి ఉంటుంది.






