నేడు తిరుపతి జిల్లాలోని శ్రీ సిటీ లో కూటమి ప్రభుత్వం సృష్టించిన అద్భుతాన్ని ఆవిష్కరించనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. 2014 ఏపీ పునర్విభజన తరువాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన చంద్రబాబు నాయుడు వెనుకబడిన రాయలసీమ అభివృద్ధి నేపథ్యంలో శ్రీ సిటీ రూపకల్పన చేసి వందలాది పరిశ్రమలను రాష్ట్రానికి ఆహ్వానించారు.
బాబు శ్రీ సిటీ అనే పారిశ్రామిక నగరాన్ని సృష్టిస్తే, 2019 లో అధికారాన్ని చేపట్టిన జగన్ రుషికొండకు గుండు కొట్టి ఒక మహా ప్యాలస్ ను సృష్టించారు. అయితే బాబు సృష్టించిన నిర్మాణాలు వేలాది కుటుంబాలకు జీవనోపాధిని కలిగిస్తే, జగన్ సృష్టించిన ప్యాలస్ లు కోట్లాది మంది కష్టాన్ని మింగేసింది.
టీడీపీ ప్రభుత్వ హయాంలో రాజధాని లేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నూతన రాజధాని గా అమరావతిని సృష్టించిన బాబు ‘సన్ రైజ్’ స్టేట్ గా ఏపీని ప్రపంచం ముందు నిలిపారు. అయితే వైసీపీ సర్కార్ జమానాలో ఏపీకి ఒక రాజధాని సరిపోదని మూడు రాజధానులను సృష్టించి ‘సన్ సెట్’ స్టేటుగా ఏపీని మార్చేశారు జగన్.
అమరావతి సృష్టితో బాబు ఏపీని పురోగమనం దిశగా పరుగులు పెట్టిస్తే, మూడు రాజధానుల సృష్టితో జగన్ ఏపీని తిరోగమనం దిశగా పాతాళానికి తొక్కారు. బాబు తన హయాంలో డ్వాక్రా సంఘాలను సృష్టించి దేశం మొత్తం తన అడుగులో అడుగేసేలా చేసుకుంటే, వాలంటీర్ వ్యవస్థను సృష్టించిన జగన్ ప్రభుత్వ వ్యవస్థలను నిర్వీర్యం చేసి రాజ్యాంగానికి తూట్లు పొడిచారు.
డ్వాక్రా సంఘాల సృష్టితో రాష్ట్రంలో మహిళలు తమ కాళ్ళ మీద తాము నిలబడేలా బాబు చేయూతనందిస్తే, జగన్ సృష్టించిన వాలంటీర్ వ్యవస్థ మహిళల భద్రతను ప్రశ్నించే స్థాయికి దిగజారింది. బాబు రాజకీయ నాయకులను సృష్టిస్తే, జగన్ రాజకీయ పైశాచికత్వాన్ని సృష్టించారు.
బాబు సృష్టించిన రాజకీయ నాయకులు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో వివిధ పార్టీలలో కొనసాగుతూ రాజకీయ మనుగడ సాగిస్తున్నారు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ కేసీఆర్, రేవంత్, సీతక్క. కానీ జగన్ సృష్టించిన రాజకీయ పైశాచికత్వం ఒక్క వైసీపీ లో మాత్రమే మనుగడ సాగించగలదు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ అవినాష్ రెడ్డి, సజ్జల భార్గవ్ రెడ్డి.
బాబు విలువలతో కూడిన విశ్లేషణాత్మక రాజకీయాలు సృష్టిస్తే, జగన్ బూతులతో కూడిన విధ్వంసకర రాజకీయాన్ని సృష్టించారు. పార్టీల మధ్య పొత్తుల సృష్టితో బాబు కులాలను కలిపే రాజకీయం చేస్తే, జగన్ రాష్ట్రంలో మూడు ముక్కలాట సృష్టించి మీడియాలకు, రాజధానికి, న్యాయమూర్తులకు సైతం కులాలను ఆపాదించి విచ్ఛిన్న రాజకీయాన్ని ప్రోత్సహించారు.
బాబు విజనరీ సైబరాబాద్ వంటి మహా నగరాన్ని సృష్టించి ప్రపంచానికి పరిచయం చేస్తే, జగన్ ముర్కత్వం తాలూకా సృష్టి అమరావతి వంటి మహా నగరాన్ని మట్టి పాలు చేసి ప్రపంచం ముందు అనాధగా నిలబెట్టింది. బాబు నాయకత్వంలో పరిశ్రమలు సృష్టించబడితే, జగన్ హయాంలో ప్యాలస్ లు సృష్టించబడ్డాయి. ఒకరి సృష్టి అద్భుతాలను ఆవిష్కరిస్తే, మరొకరి సృష్టి విధ్వంసాన్ని కోరుకుంది.
ఇలా ఇద్దరు రాజకీయ నాయకులు సృష్టికర్తలే… కానీ, ఒకరి సృష్టితో రాష్ట్ర అభివృద్ధి జరిగితే మరొకరి సృష్టితో రాష్ట్ర విధ్వంసం జరిగింది. ఒకరి సృష్టితో వేలాది మందికి ఉపాధి కలిగితే మరొకరి సృష్టి కోట్లాది మంది కష్టాన్ని కొండపాలు చేసింది. ఒకరి సృష్టి చరిత్రలో మిగిలిపోతే, మరొకరి సృష్టి చరిత్ర కాలగర్భంలో కలిసిపోయింది.






