నేటితో ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ముగియనున్నాయి. ముందుగా ఉభయ సభల్లో డీఎస్సీపైనే చర్చ జరిగింది. కానీ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, పది మంది ఎమ్మెల్యేలు ఎప్పటిలాగే శాసనసభకు మొహం చాటేయడంతో, ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం వదులుకున్నారు.
గత మూడు రోజులుగా వైసీపీ ఎమ్మెల్సీలు మండలిని స్తంభింపజేయడాన్ని వైసీపీ గొప్పగా చెప్పుకుంటోంది. కానీ డీఎస్సీపై చర్చ జరిగి, వైసీపీ సభ్యుల ప్రశ్నలకు మంత్రి నారా లోకేష్ సమాధానాలు చెప్పుకునేలా దాని వ్యూహం ఉండాలి కానీ, సభలో నినాదాలు చేస్తూ స్థంభింపజేయడం వైసీపీ వైఫల్యమే కదా?
ఓ పక్క మండలిలో వివిధ అంశాలపై చర్చలు జరుగుతుంటే, వాటిలో పాల్గొనకుండా నినాదాలు చేయడం బాధ్యతారాహిత్యమే కదా?
శాసనసభ సమావేశాలకు రాని జగన్మోహన్ రెడ్డికి, మండలికి వస్తున్న వైసీపీ ఎమ్మెల్సీలకు ఇక తేడా ఏముంది?
మంత్రి నారా లోకేష్ డీఎస్సీపై వైసీపీ ఎమ్మెల్సీలకు జవాబు చెప్పలేకనే మండలికి మొహం చాటేస్తున్నారంటూ వైసీపీ చెప్పుకుంటోంది.
అయితే జగన్ గత రెండేళ్ళుగా శాసనసభకు మొహం చాటేస్తూనే ఉన్నారుగా? అది తప్పుగా అనిపించలేదా? డీఎస్సీపై ప్రభుత్వాన్ని నిలదీసి, మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి శాసనసభ సమావేశాలకు వచ్చి ఎదుర్కోవచ్చు కదా? కానీ ఎందుకు రావడం లేదు?
శాసనసభకి వచ్చేందుకు భయపడుతూ, శాసనసభ సమావేశాలలో పాల్గొంటున్న మంత్రి నారా లోకేష్ని విమర్శించడం చాలా హాస్యాస్పదంగా ఉంది కదా?




