సోమవారం గుంటూరులో వసంతరాయపురంలోని స్థానిక ఓంకార్ ఆలయం వద్ద గుంటూరు తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జి మహమ్మద్ నసీర్ నేతృత్వంలో బాదుడే బాదుడు నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో వార్డు ప్రెసిడెంట్ గుడిమెట్ల దయారత్నం, కార్పొరేటర్లు ముప్పవరపు భారతి, గొల్ల ప్రభాకర్, మన్యం మాల్యాద్రి, ఉప్పుటూరి వెంకటేష్, తిరుపతిరావు, శైలజ, రసూల్, కొక బాలాజీ, గొట్టిపాటి బాబు ప్రభాకర్, రాజేష్, అశోక్, వెంకటేశ్వరరావు, పలువురు టిడిపి కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మహమ్మద్ నసీర్ వారిని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “గతంలో చంద్రబాబు నాయుడు హయాంలో దళితుల కోసం ప్రత్యేకంగా బడ్జెట్లో రూ.3,000 కోట్లు కేటాయించి పలు సంక్షేమ పధకాలు అమలుచేస్తే, జగన్ ప్రభుత్వం దళితులకు మాయమాటలు చెప్పి మభ్యపెట్టి మోసం చేస్తోంది తప్ప సంక్షేమ పధకాలు అందించడం లేదు. సంక్షేమ పధకాల పేరు చెప్పి దళితుల ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిన తరువాత సిఎం జగన్మోహన్ రెడ్డి దళిత సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లించి దళితులను మోసం చేసింది. రాష్ట్రంలో అందరికీ సంక్షేమ పధకాలు అందజేస్తున్నామని గొప్పగా చెప్పుకొంటారు కానీ ఏ ఒక్క వర్గానికి న్యాయం చేయడం లేదు. ప్రతీ వర్గానికి జగన్ ప్రభుత్వం కుచ్చు టోపీలు పెడుతూనే ఉంది. కనుక సంక్షేమ పధకాల మాయలో పది మళ్ళీ వైసీపీకి ఓట్లు వేయవద్దని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను,” అని అన్నారు.



